బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, కానీ బాబు కుమారుడికి తప్ప ఎవరికీ జాబ్ రాలేదని బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు.
శ్రీకాకుళం: బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, కానీ బాబు కుమారుడికి తప్ప ఎవరికీ జాబ్ రాలేదని బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై, టీడీపిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు
టీడీపి నేతలు అవినీతిలో పోటీ పడ్డారనే తప్ప అభివృద్ధిలో కాదని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన బిజెపి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. జన్మభూమి కమిటీ సభ్యుడి నుంచి మంత్రి వరకు అవినీతిలో కూరుకుపోయారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు మోసం చేయడానికి ఏ ఒక్క కులం కూడా మిగలలేదని వ్యాఖ్యానించారు. అన్నం పెట్టిన చేతిని నరకడం చంద్రబాబు సహజగుణమని అన్నారు. సాయం చేసిన మోడీని మోసం చేసి రాకీయ ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపి డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.
రాష్ట్రంలో తమ పార్టీపై వ్యూహాత్మక దాడి కొనసాగుతోందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. 2019లో ప్రదాని ఎవరో తామే నిర్ణయిస్తామని టీడీపి అనడం అవివేకమని అన్నారు.
టీడీపి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న భ్రమలు తొలగిపోయాయని అన్నారు. చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చేది, తెచ్చేది బిజెపియేనని అన్నారు.
