కాణిపాకం : భక్తులకు ఊరట... పంచామృతాభిషేకం ధర పెంపుపై వెనక్కి తగ్గిన పాలక మండలి
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో పంచామృతాభిషేకం ధర పెంచుతున్నట్లు వార్తలు రావడంపై ట్రస్ట్ బోర్డ్ స్పందించింది. ధరలను పెంచడం లేదని.. సామాన్య భక్తులకు అందబాటులోనే ధరలు వుంటాయని తెలిపింది.
కాణిపాకం అభిషేకం టికెట్ల ధరలపై ఏర్పడిన గందరగోళానికి తెరపడింది. కాణిపాకంలో పంచామృత అభిషేకం టికెట్ ధరలను పెంచలేదని తెలిపారు ఆలయ అధికారులు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా స్వామి వారి సేవలు అందుబాటులో వుంచుతామన్నారు . అభిషేకం ధరలపై అభిప్రాయ సేకరణను ఉపసంహరించుకున్నట్లు దేవస్థానం బోర్ట్ తెలిపింది.
కాగా.. స్వామి వారి పంచామృతం అభిషేకం టికెట్ ధరలు పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. టికెట్ ధరను రూ.700 నుంచి రూ.5000 వరకు పెంచారన్న వార్తలతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై కాణిపాకం ట్రస్ట్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. అటు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. కాణిపాకం అభిషేకం టికెట్ ధరలు పెరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం వున్న రూ.700 ధర యథాతథంగా వుంటుందని తెలిపారు. టికెట్ ధర పెంపుపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న అధికారులను తొలగించాలన్నారు మంత్రి.
ALso Read:షాకింగ్.. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో పంచామృతాభిషేకం ధర భారీ పెంపు.. !
అంతకుముందు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో వరసిద్ధి వినాయక స్వామివారి పంచామృతాభిషేకం టికెట్ ధరలను భారీగా పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో పంచామృతాభిషేకం ధర ఏడు రెట్లు పెంచారు. ప్రస్తుతం పంచామృతాభిషేకం టికెట్ ధర రూ.750లు ఉంది. అయితే, ఇప్పుడు ఏడురెట్లు పెరగడంతో రూ.750 టికెట్ ధర ఏకంగా రూ.5000లకు చేరుకుంది.
ఆలయంలో ఇప్పటి వరకూ ప్రతిరోజూ మూడుసార్లు పంచామృతాభిషేకం నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఈ సేవ భక్తులకు ఉదయం ఐదు నుంచి ఆరు గంటల వరకు కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక అభిషేకానికి భారీగా టికెట్ ధరను నిర్ణయించింది దేవస్థానం. అయితే ఈ పంచామృతాభిషేకం ధర పెంపు పై అభిప్రాయాలు తెలిపేందుకు ఉభయదారులకు 15 రోజుల గడువు విధించింది. ఈ మేరకు ఒక నోటీసును కూడా విడుదల చేసింది.