షాకింగ్.. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో పంచామృతాభిషేకం ధర భారీ పెంపు.. !
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో పంచామృతాభిషేకం ధరలు ఏడురెట్లు పెంచుతూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిమీద ఏడురోజుల్లోగా వాదనలు వినిపించమంది.
చిత్తూరు : చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం. ఈ క్షేత్రంలో విఘ్నాలకు అధిపతి వినాయకుడు వరసిద్ధి వినాయకుడిగా పూజలందుకుంటున్నాడు. అయితే తాజాగా ఈ ఆలయంలో అభిషేకం టికెట్ ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో స్వామివారి పంచామృతాభిషేకం టికెట్ ధరలను భారీగా పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో పంచామృతాభిషేకం ధర ఏడు రెట్లు పెంచారు. ప్రస్తుతం పంచామృతాభిషేకం టికెట్ ధర రూ.750లు ఉంది. అయితే, ఇప్పుడు ఏడురెట్లు పెరగడంతో రూ.750 టికెట్ ధర ఏకంగా రూ.5000లకు చేరుకుంది.
అయితే వరసిద్ధి ఆలయంలో ఇప్పటి వరకూ ప్రతిరోజూ మూడుసార్లు పంచామృతాభిషేకం నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఈ సేవ భక్తులకు ఉదయం ఐదు నుంచి ఆరు గంటల వరకు కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక అభిషేకానికి భారీగా టికెట్ ధరను నిర్ణయించింది దేవస్థానం. అయితే ఈ పంచామృతాభిషేకం ధర పెంపు పై అభిప్రాయాలు తెలిపేందుకు ఉభయదారులకు 15 రోజుల గడువు విధించింది. ఈ మేరకు ఒక నోటీసును కూడా విడుదల చేసింది.