వివేకా కుమార్తె లేఖ, స్పందించిన కడప ఎస్పీ.. సునీత ఇంటి వద్ద పోలీస్ భద్రత
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రాసిన లేఖపై కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. సునీత ఇంటి వద్ద వెంటనే పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, వెంటనే భద్రత కల్పించాలని కోరుతూ దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రాసిన లేఖపై కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. సునీత ఇంటి వద్ద వెంటనే పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే సునీత లేఖలో పేర్కొన్న ఇతర అంశాలపైనా విచారణ చేయాలని ఎస్పీ అన్బురాజన్ ఆదేశించారు. విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ స్థాయి అధికారికి సూచించారు.
అంతకుముందు తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కడప ఎస్పీ అన్బురాజన్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత లేఖ రాశారు.ఈ నెల 10వ తేదీన పులివెందులలోని తమ నివాసం వద్ద మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో శివశంకర్ రెడ్డి అనుమానితుడిగా ఉన్నాడన్నారు. ఆయన అనుచరుడు మణికంఠరెడ్డి తమ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
ALso Read:మా ఇంటి వద్ద రెక్కీ, రక్షణ కల్పించండి: కడప ఎస్పీకి వైఎస్ వివేకా కూతురు లేఖ
సీసీకెమెరాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించామన్నారు. తమ కుటుంబానికి భద్రత కల్పించాలని ఆమె కోరారు. ఈ లేఖలను డీజీపీ, సీబీఐ అధికారులకు కూడ పంపారు.ఈ లేఖలతో పాటు సీసీటీవీ దృశ్యాలున్న పెన్ డ్రైవ్ లను కూడ జత చేసినట్టుగా ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.