మా ఇంటి వద్ద రెక్కీ, రక్షణ కల్పించండి: కడప ఎస్పీకి వైఎస్ వివేకా కూతురు లేఖ
తమ కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని కడప ఎస్పీ అన్బురాజన్ కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత లేఖ రాశారు.తమ ఇంటి ముందు మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.
కడప: తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కడప ఎస్పీ అన్బురాజన్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత లేఖ రాశారు.ఈ నెల 10వ తేదీన పులివెందులలోని తమ నివాసం వద్ద మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో శివశంకర్ రెడ్డి అనుమానితుడిగా ఉన్నాడన్నారు. ఆయన అనుచరుడు మణికంఠరెడ్డి తమ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
also read:వైఎస్ వివేకా హత్య కేసు: ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు శంకర్ రెడ్డి విచారణ
సీసీకెమెరాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించామన్నారు. తమ కుటుంబానికి భద్రత కల్పించాలని ఆమె కోరారు. ఈ లేఖలను డీజీపీ, సీబీఐ అధికారులకు కూడ పంపారు.ఈ లేఖలతో పాటు సీసీటీవీ దృశ్యాలున్న పెన్ డ్రైవ్ లను కూడ జత చేసినట్టుగా ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.
2019 మార్చి 14న ఇంట్లనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో 68 రోజులుగా నిరాటంకంగా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో అనుమానితుల నుండి కీలక సమాచారాన్ని సేకరించారు. సునీల్ యాదవ్ నుండి కీలక డాక్యుమెంట్లను సీజ్ చేశారు., వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కూడ సీజ్ చేశారు.ఇదిలా ఉంటే ఇవాళ కడప ఎంపీ వైఎస్ అవినాష్ సన్నిహితుడు శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు.