వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో  నిందితుడిగా  ఉన్న  దస్తగిరికి  పోలీసులు అదనపు భద్రతను  కల్పించారు.  

కడప: జిల్లాలోని పులివెందులలోని దస్తగిరి నివాసం వద్ద పికెట్ ఏర్పాటు చేశారు పోలీసులు. తనకు అదనపు రక్షణ కల్పిచాలని దస్తగిరి జిల్లా ఎస్పీ, రాయలసీమ రేంజ్ డీఐజీకి వినతిపత్రాలు సమర్పించారు. దీంతో పులివెందులలోని దస్తగిరి నివాసం వద్ద పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారాడు. 

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుల నుండి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఈ నెల 19న దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఈ వినతి మేరకు దస్తగిరి నివాసం వద్ద ఇద్దరు పోలీసులతో పికెట్ ను ఏర్పాటు చేశారు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ మరింత వేగవంతం చేసింది. గత వారంలో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రస్తుతం సీబీఐ విచారిస్తుంది. ఈ తరుణంలో తనకు వైఎస్ అవినాష్ రెడ్డి నుండి బెదిరింపులు వస్తున్నాయని దస్తగిరి చేసిన ఫిర్యాదును పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. దస్తగిరి నివాసం వద్ద పికెట్ ను ఏర్పాటు చేసింది. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఈ నెల 30వ తేదీ లోపుగా కొలిక్కి తీసుకురావాలని సీబీఐని ఆదేశించింది సుప్రీంకోర్టు. దీంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి , వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయంపై సీబీఐ అధికారులు 
 ఆరా తీస్తున్నారు.

also read:అవినాష్ అనుచరులు నన్ను అనుసరిస్తున్నారు.. తగిన రక్షణ కల్పించండి: కడప ఎస్పీ ఆఫీసులో దస్తగిరి ఫిర్యాదు

వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున చోటు చేసుకున్న పరిణామాలపై శాస్త్రీయ ఆధారాలను సీబీఐ సేకరిస్తుంది. 2019 మార్చి 14వ తేదీ రాత్రి పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు రూ. 40 కోట్ల డీల్ జరిగిందని దస్తగిరి ఆరోపించాడు. ఈ డీల్ విషయమై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.