ఉక్కు పరిశ్రమ తెచ్చే బాధ్యత లేదా మీకు?
- రాజుకుంటున్న కడప ఉక్కు-సీమ హక్కు ఉద్యమం
- ఉద్యమం తీవ్రతరం చేస్తున్న స్టీల్ ప్లాంట్ సాధనా సమితి
విభజన చట్టంలో పేర్కొన్న కడప ఉక్కు కర్మాగారం కోసం విద్యార్థులు, నిరుద్యోగ యువత, రాయలసీమ వాదులతో కలిసి స్టీల్ ప్లాంటు సాధనా సమితి ఉద్యమాలు చేస్తున్నా కనీసం ప్రజా ప్రతినిధుల్లో చలనం కనిపించడంలేదని, ఉక్కు పరిశ్రమ కోసం బాధ్యత తీసుకుని ప్రభుత్వంపై వత్తిడి తేవాల్సిన ప్రజాప్రతినిధులు చోద్యం చూడటమేమిటని స్టీల్ ప్లాంటు సాధనా సమితి అధ్యక్షులు జీవి.ప్రవీణ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. ప్రొద్దుటూరు మాస్టర్స జూనియర్ కాలేజీలో రాయలసీమ విద్యార్థి గర్జన పేరుతో స్టీల్ ప్లాంటు ఉద్యమ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప జిల్లాలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కడప జిల్లాలో ఏర్పాటు కాకుండా మూడేళ్ళుగా కాలయాపనకు గురైన ఉక్కు కర్మాగారం కోసం ఒక్కరూ నోరు మెదకపోవడం దారుణమన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అధికారం కోసం చెప్పుతో కొట్టుకుని నిరసన తెలియ జేసిన ప్రజా ప్రతినిధులు, మట్కా వారికోసం, అసాంఘీక కార్యకలాపాల్లో ఉన్న వారి కోసం పోలీస్టేషన్లకు వెళ్లి ఆందోళనలు చేసిన ప్రజా ప్రతినిధులకు ఈ ఉక్కు క ర్మాగారం సమస్య కనిపించదా? అని ప్రశ్నించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభజన చట్టంలోని హామీలను చట్టబద్ధంగా అమలు చేయాల్సి ఉన్న దాన్ని అడగటానికి నోరెందుకు రావడంలేదో ప్రశ్నించాలని యువతకు ప్రవీణ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉక్కు పరిశ్రమ వస్తే తమ బతుకులు బాగుపడతాయని కడప జిల్లాతో పాటు, రాయలసీమ జిల్లాల్లోని యువత ఎదురుచూస్తోందన్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు కడప ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమించకపోతే, ప్రభుత్వాలపై వత్తిడి తీసుకుని రాపోతే యువత చేస్తున్న ఆందోళన మరింత ఉదృతమవుతుందన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం తలపెట్టిన మార్చ్ఫాస్టుకు రాయలసీమ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిందండ్రులు హాజరై ప్రజాప్రతినిధులపై యుద్ధం ప్రకటించక మునుపే ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతలు ఎరిగి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు.