Journalist Krishnamraju arrested: అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో జర్నలిస్టు కృష్ణంరాజు విశాఖలో అరెస్ట్‌ అయ్యారు. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

Journalist Krishnamraju arrested: జ‌ర్నలిస్టు కృష్ణంరాజు, అమరావతి మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యల కేసులో బుధవారం విశాఖపట్నంలో అరెస్ట్‌ అయ్యారు. ఈ కేసులో ఆయనను ఏ1 నిందితుడిగా పోలీసులు గుర్తించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పోలీసుల కథనం ప్రకారం.. జూన్ 6న సాక్షి టీవీలో నిర్వహించిన చర్చావేదికలో కృష్ణంరాజు చేసిన వివాదాస్ప‌ద‌ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై ఆయ‌న చేసిన‌ వ్యాఖ్యలపై పలు మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు, ఫిర్యాదులు కూడా నమోదు చేశారు.

అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాల్లో ఉన్న ఫిర్యాదులను పరిశీలించారు. అందులో భాగంగా కృష్ణంరాజును బుధ‌వారం విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కృష్ణంరాజు ప్రధాన నిందితుడు (ఏ1)గా ఉన్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు.

అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై కృష్ణంరాజు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతున్న వేళ, పోలీసులు వెంటనే స్పందించారు. ఆయన అరెస్ట్‌పై అధికారిక ప్రకటన త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇదే కేసులో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పటికే అరెస్టు 

జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్‌లోని జర్నలిస్టుల కాలనీలో ఉన్న నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు.

ఈ అరెస్టు, గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఇటీవల నమోదైన కేసు ఆధారంగా జరిగింది. అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళలు మరియు రైతులు కలిసి ఆయనపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.

అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని, ఉద్యమంలో పాల్గొంటున్న వారిని అవమానించేలా ఉన్నాయని వారు పేర్కొన్నారు.