టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జ‌గ‌న్ నియ‌మించుకున్న‌ స‌ల‌హాదారుల్లో చాలా మందికి చ‌దువు రాదంటూ వ్యాఖ్యానించారు.  కోర్టు తీర్పు ప‌ట్టించుకోని అధికారుల‌పై చ‌ర్య‌లను జేసీ సమర్ధించారు.  

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే టీడీపీ (tdp) నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ (tadipatri municipal chairman) జేసీ ప్రభాకర్ రెడ్డి (jc prabhakar reddy) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జ‌గ‌న్ నియ‌మించుకున్న‌ స‌ల‌హాదారుల్లో చాలా మందికి చ‌దువు రాదని, సంత‌కాల కోసం మాత్ర‌మే అధికారుల‌ను వాడుకుంటున్నారని ఆరోపించారు. హైకోర్టు (ap high court) ఆదేశాలు ఇచ్చినా కింది స్థాయిలో అమ‌లు కావ‌ట్లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కోర్టు తీర్పు ప‌ట్టించుకోని అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పులు క్షేత్రస్థాయిలో అమ‌లు అయ్యేలా చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. 

కాగా.. కోర్టు ధిక్కరణ కేసులో ఎనిమిది మంది ఐఎఎస్ లకు హైకోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై ఏపీ హైకోర్టుకు ఐఎఎస్ లు క్షమాపణ చెప్పడంతో Jail శిక్షకు బదులుగా సేవా కార్యక్రమాలు చేయాలని ఉన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. విజయ్ కుమార్, గోపాలకృష్ణ ద్వివేది, శ్యామలారావు, రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, చిన వీరభద్రుడు, ఎంఎంనాయక్ లపై హైకోర్టు సీరియస్ అయింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయవద్దని ఆదేశాలను హైకోర్టు గతంలో జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను IAS లు అమలు చేయలేదు. దీంతో కోర్టు ధిక్కరణ కింద ఎనిమిది మంది ఐఎఎస్‌లకు రెండు వారాల పాటు జైలు శిక్షను విధించింది.

ఈ విషయమై ఐఎఎస్ లు కోర్టును క్షమాపణలు కోరారు. దీంతో సంక్షేమ హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేయాలని ఐఎఎస్ లను కోర్టు ఆదేశించింది. జైలు శిక్షకు బదలుగా హాస్టల్ విద్యార్ధులకు సేవ చేయాలని సూచించింది.ప్రతి నెల ఏదో ఒక రోజు సంక్షేమ హాస్టళ్లలో ఐఎఎస్ లు సేవ చేయాలని సూచించింది. అంతేకాదు ఒక రోజు పాటు కోర్టు ఖర్చులను కూడా భరించాలని ఆదేశించింది. 2021 సెప్టెంబర్ మాసంలో కూడా ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్ సహా ఐదుగురు ఐఎఎస్ అధికారులకు కూడా ఏపీ హైకోర్టు శిక్ష విధించింది. 

నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాదు జరిమానాను విధించింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని కారణంగా కూడా హైకోర్టు ఈ శిక్ష విధించింది. తాజాగా ఎనిమిది మంది ఐఎఎస్ అధికారులకు కూడా జైలు శిక్ష విధించింది. అయితే ఐఎఎస్ లు క్షమాపణ కోరడంతో ఉన్నత న్యాయస్థానం సంక్షేమ హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేయాలని ఆదేశించింది.