ఈ నెల 15నుంచి పవన్ బస్సు యాత్ర
శ్రీకాకుళం నుంచి యాత్ర మొదలు
ఏపీలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆయన తన ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలనూ చుట్టివచ్చేలా యాత్ర ఏకబిగిన కొనసాగనుంది. ఈ నెల 15వ తేదీన శ్రీకాకుళం నుంచి యాత్ర ప్రారంభం కానుండగా.. ఇప్పటికే ఈ మేరకు షెడ్యూల్ పూర్తి చేశారు.
యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్పై కసరత్తు కూడా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ యాత్ర కోసం ఒక వావానాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. ఈ వాహనంతోపాటు, యాత్ర ఎక్కడ నుంచి ప్రారంభమై, ఎక్కడ ముగించాలనేదీ పవన్ కల్యాణ్ ఖరారు చేసినట్లు సమాచారం. ప్రజల్లోకి వెళ్లడం.. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను గుర్తించడం.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం లక్ష్యంగా యాత్ర చేపడుతున్నారు.
ప్రధాన సమస్యలున్న ప్రాంతాలకు వెళ్లినపుడు ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చేదీ వాటి పరిష్కారంలో పార్టీ విధానం ఏంటనేదీ అక్కడికక్కడే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. పార్టీ కమిటీల ఏర్పాటు కొనసాగుతున్నందున ఆయా జిల్లాల్లో వాటి పురోగతిపై పార్టీ ప్రతినిధులతో సమీక్షలు నిర్వహించనున్నారు.