పవన్ ఉత్తరాంధ్ర టూర్ ఖరార్..
- హార్వర్డ్ వైద్య బృందంతో చర్చించనున్న పవన్
- సీఎం చంద్రబాబుతో సమావేశం
జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ టూర్ ఖరారు అయ్యింది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు ఊరట కలిగేంచేందుకు పవన్ ఉత్తరాంధ్ర వెళుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అక్కడికి వెళ్లడం ఇది రెండోసారి. ఈసారి పవన్ హార్వర్డ్ వైద్య బృందంతో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు హార్వర్డ్ డాక్టర్లు ఉధ్దానంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 9గంటలకు ఆంధ్రా వైద్య కళాశాల వైస్ ఛైర్మన్ తో హార్వర్డ్ డాక్టర్లతో సమావేశం కానున్నారు. అనంతరం 9గంటల 50 నిమిషాలకు మెడికల్ కళాశాల వద్ద మీడియాతో మాట్లాడనున్నారు. అక్కడ నుంచి బస్సులో ఉద్దానం వెళతారు.
అక్కడి పరిస్థితులను పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బోరివంక, కవిటి మండలం, ఉద్దానం గ్రామాల్లో పర్యటించనున్నారు. అక్కడ గ్రామస్థులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4గంటల సమయంలో విశాఖకు బయలుదేరి వెళతారు.
ఆదివారం(జులై 30వతేది) విశాఖలోని వైజాగ్ కన్వెన్షన్ హాల్ లో ఉద్దానం బాధితుల గురించి నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరౌతారు.ఉదయం 9గంటలకు ప్రారంభమై ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాలకు ముగియనుంది. అనంతరం పవన్.. హార్వర్డ్ వైద్యులతో సమావేశమౌతారు. సమావేశం అనంతరం విజయవాడ వెళ్లి ఈ విషయమై ఆయన సీఎం చంద్రబాబుతో చర్చిస్తారు.