నంద్యాల జిల్లాలో జనసేన కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు వున్నారని వైసీపీ నేతలు విర్రవీగుతున్నారని.. కానీ వచ్చే ఎన్నికల్లో 15 సీట్లు కూడా రావని పవన్ జోస్యం చెప్పారు. 

151 మంది ఎమ్మెల్యేలు వున్నారని విర్రవీగుతున్నారని.. రేపు ఎన్నికల్లో వైసీపీకి (ysrcp) 15 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) జోస్యం చెప్పారు. కౌలు రైతుల భరోసా యాత్రలో (janasena koulu rythu bharosa yatra) భాగంగా ఆదివారం నంద్యాల జిల్లాలో (nandyal district) పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆయన ఆర్ధిక సాయం అందజేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. తన సినిమాలు, ఆర్ధిక మూలాలు దెబ్బకొట్టినా భయపడేది లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తనకు భయం లేదని.. వైసీపీ నేతలు అది తెలుసుకోవాలని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

వైసీపీ నేతలు ఎప్పుడూ తనను తిడుతూనే వుంటారని... అయినా తాను భరిస్తూనే వుంటానని పవన్ అన్నారు. సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్ట్‌ని జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తుందని.. మీరు తమకు ఐదు సంవత్సరాల సమయం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారని.. అయినా సీమ ఎందుకు వెనుకబడి వుందని పవన్ ప్రశ్నించారు. వెనుకబడింది ప్రజలని.. నాయకులు కాదని ఆయన దుయ్యబట్టారు. 

తన కార్యక్రమానికి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను వైసీపీ నేతలు బెదిరించి రానివ్వలేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ... అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదన్నట్లుగా వైసీపీ నేతల తీరు వుందని ఆయన దుయ్యబట్టారు. మమ్మల్ని ఆపేదెవరు.. మంచికి నిలబడి వున్నామని, కష్టాల్లో వున్న ప్రజలకు అండగా నిలబడ్డామని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 3000 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. వారందరికీ తలో లక్ష ఆర్ధిక సాయం చేస్తామని జనసేనాని వెల్లడించారు. 

ఈ కార్యక్రమాన్ని దయచేసి అడ్డుకోవద్దని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పురుగు మందు తాగిన భర్తను చూసి భార్య కూడా అదే మందు తాగి ఆత్మహత్య చేసుకుందని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలుకి వ్యవసాయం చేద్దామంటే నకిలీ ఎరువులు, విత్తనాలు వేధిస్తున్నాయని పవన్ దుయ్యబట్టారు. దీనికి విసిగిపోయి అప్పుల్లో కూరుకుపోయి చివరికి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు అండగా వుంటామని చెప్పి వైసీపీ మాట తప్పిందని పవన్ దుయ్యబట్టారు. 

అంతకుముందు ఉదయం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. జనసేనను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని.. ఇది వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ అద్భుత పాలన చేయవచ్చని అన్నారు. కానీ సంఖ్య బలం ఉందని దౌర్జన్యం చేసే పరిస్థితులు ఉన్నాయని.. వారు పద్దతి మార్చుకోవాలని సూచించారు. యువతకు ఉద్యోగాలు లేవని.. ఎవరైనా గొంతు ఎత్తితే వారిపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ చర్యలకు జనసేన వెనక్కి తగ్గదని.. ఈ తరం అసలు తగ్గదని అన్నారు.

చంద్రబాబు త్యాగాలకు సిద్దమని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందించిన పవన్ కల్యాణ్.. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడేది కావాలన్నారు. వ్యక్తిగతంగా తాను ఏ లాభాపేక్ష కోరుకోనని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ మరింతగా అంధకారంలోకి వెళ్లిపోతుందని, పరిస్థితులు మరింతగా దిగజారిపోతాయని చెప్పారు. 

ఓటు చీలిపోతే రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు చాలా మంది కలిసి పనిచేయాలన్నారు. విశాల దృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు భరోసా కల్పించడానికి.. ఎంతవరకు అందరూ కలిసి వస్తారనేది భవిష్యత్తులో తేలుతుందన్నారు. దీనిపై చర్చ జరగాల్సిన అవరసం ఉందన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పారు. ఏపీ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలన్నారు. ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నట్టుగా చెప్పారు.