త్వరలో రోడ్డెక్కనున్న పవన్ వారాహి.. గోదావరి జిల్లాల నుంచే, రూట్మ్యాప్పై జనసేన కసరత్తు..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తన వారాహి వాహనాన్ని రోడ్డెక్కించే పనిలో పడ్డారు. గోదావరి జిల్లాల నుంచే పవన్ కల్యాణ్ వారాహిపై పర్యటన మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సారి రాజకీయాల్లో సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గతంలో చేసిన తప్పులను మరోసారి చేయనని.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని, ఈసారి ఓడిపోయేందుకు సిద్ధంగా లేనని ఆయన పలుమార్లు స్పష్టం చేశారు. ఇందుకోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా తన రాష్ట్రవ్యాప్త పర్యటనల కోసం వారాహి పేరుతో ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించారు. దీని రంగు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అప్పట్లో కలకలం రేపాయి.
అదిగో వారాహి, ఇదిగో వారాహి అంటూ జనసేన నేతలు హడావుడి చేశారు తప్పించి పవన్ మాత్రం పర్యటనకు శ్రీకారం చుట్టలేదు. కొద్దినెలల క్రితం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం దానిని విజయవాడలోని కనకదుర్గ ఆలయం వద్దకు తీసుకొచ్చి మరోమారు పూజలు చేశారు. అదే రోజున విజయవాడ నుంచి బందర్ వరకు వారాహిలో ప్రయాణించిన పవన్ కల్యాణ్.. జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాత వారాహిని గ్యారేజ్కే పరిమితం చేశారు.
ALso Read: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీతోనే జనసేన , మా హైకమాండ్తో పవన్ మాట్లాడారు : సుజనా చౌదరి
అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తులు దాదాపుగా ఖరారు అయినట్లేనని మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి తోడు ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతూ వుండటంతో వారాహిని రోడ్డెక్కించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ప్రస్తుతం పవన్ చేతిలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, బ్రో సినిమాలు వున్నాయి. వీటిన్నంటినీ వేగంగా పూర్తి చేసిన ఎన్నికల రణరంగంలో దూకాలని ఆయన భావిస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచే పవన్ కల్యాణ్ వారాహిపై పర్యటన మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి శుక్రవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ కీలక నేతలతో నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ పర్యటన రూట్ మ్యాప్పై కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.