ఏపీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. ప్రచార యాత్రకు జనసేనాని సన్నాహాలు, ప్రాంతాల వారీగా కమిటీలు

Synopsis
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇందుకోసం ప్రాంతాల వారీగా కమిటీలను నియమించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రలో ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా ఆయన రాష్ట్రాన్ని విభజించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై గట్టి ఫోకస్ పెట్టారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. సీట్ల పంపకాలపై చంద్రబాబుతో మాట్లాడుతూనే ప్రచారంపై దృష్టి పెట్టారు. గతేడాది వారాహి విజయ యాత్ర చేసిన తర్వాత ఆయన జనంలోకి పెద్దగా రాలేదు. అయితే త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇందుకోసం ప్రాంతాల వారీగా కమిటీలను నియమించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రలో ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా ఆయన రాష్ట్రాన్ని విభజించారు.
ప్రతి జోన్లోనూ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు, లీగల్ టీం, డాక్టర్స్ టీం ఉండేలా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారాన్ని పూర్తి సమన్వయంతో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. పవన్ పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్, పోలీసుల అనుమతి, ప్రమాదాలు జరిగితే తక్షణం వైద్య సదుపాయం అందించడంపై దృష్టి సారించింది జనసేన పార్టీ.
మరోవైపు.. ఈ నెలాఖరు లోగా సీట్ల పంపకాలపై టీడీపీ నుంచి క్లారిటీ తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు. అభ్యర్ధులు ఎవరనేది తేలితే.. తాను నిశ్చింతగా ప్రచారం నిర్వహించుకోవచ్చుననేది పవన్ ఆలోచన. అటు చంద్రబాబు కూడా సీట్ల పంపకాలపై నాన్చకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నెలాఖరు లోగా అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసే దిశగా దూకుడుగా వెళ్తున్నారు. వైసీపీ పూర్తి జాబితా వచ్చిన తర్వాత.. దానిని పరిశీలించి బలమైన నేతలను బరిలోకి దించాలని పవన్, చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.