ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో 219 విగ్రహాలను కూల్చింది, రాముడి తల నరికింది కూడా పిచ్చివాడేనా అని జనసేనాని సెటైర్లు వేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారాహి యాత్రలో భాగంగా శుక్రవారం పిఠాపురంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 219 హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారని చెప్పారు. పిఠాపురంలో విగ్రహాలను ధ్వంసం చేసింది ఎవరంటే పిచ్చివాడని ప్రభుత్వం చెప్పిందని పవన్ చురకలంటించారు. రాష్ట్రంలో 219 విగ్రహాలను కూల్చింది, రాముడి తల నరికింది కూడా పిచ్చివాడేనా అని జనసేనాని సెటైర్లు వేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హిందూ విగ్రహాలపై దాడులు జరిగితే ఈ ముఖ్యమంత్రి ఒక్కరిని కూడా పట్టుకోలేదని.. వైసీపీది చచ్చు ప్రభుత్వమన్నారు. విగ్రహాల ధ్వంసం అనేది శాంతి భద్రతల సమస్య అని పవన్ వ్యాఖ్యానించారు. దీనిపై తాను ప్రకాశం జిల్లా ఎస్పీని అడిగితే పై నుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్ల తాము ఏం చేయలేకపోతున్నామని చెప్పారని జనసేనాని తెలిపారు. జనసేన ప్రభుత్వం రాగానే తొలి ప్రాధాన్యత శాంతి భద్రతలకే ఇస్తామని.. లా అండ్ ఆర్డర్ కరెక్ట్‌గా వుంటే అన్ని సవ్యంగా వుంటాయని పవన్ పేర్కొన్నారు. కాకినాడ ఎమ్మెల్యే మాదిరిగా తాను అడ్డగోలుగా వచ్చి మట్టి తోలుకెళ్లనని ఆయన దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. తనకు మత పిచ్చిలేదని.. సనాతన ధర్మం పట్ల గౌరవం వుందన్నారు. 

ALso Read: నా రెండు చెప్పులూ ఎవరో కొట్టేశారు .. ఇంతగా దిగజారాలా : పేర్ని నానిపై పవన్ సెటైర్లు

పదేళ్లు పార్టీని నడపటమంటే మామూలు విషయం కాదని.. వేల కోట్లు వున్నవాళ్లు కూడా పార్టీని నడపలేరని పవన్ తెలిపారు. నేను జనసేనను నడుపుతున్నానంటే అందుకు ప్రజలే కారణమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రా నాయకులు దోపిడీ చేశారని తెలంగాణ ప్రజలు తిట్టినా మన నేతలకు బుద్ధి రాలేదన్నారు. గోదావరి తల్లి ఈ నేలను అంటిపెట్టుకుని ఎలా వుంటుందో పవన్ కూడా అలాగే అంటి పెట్టుకుని వుంటాడన తెలిపారు. జనవాణీలో తవ్వేకొద్దీ వైసీపీ దోపిడీ బయటకొస్తోందన్నారు. 

విశాఖ వైసీపీ ఎంపీ కొడుకు, భార్యను పట్టపగలు కిడ్నాప్ చేస్తే ఏం చేశారని పవన్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం క్రిమినల్స్‌ను వేనకేసుకుని వస్తుందని ఆయన ఆరోపించారు. అమ్మవారి సాక్షిగా చెబుతున్నా ఆంధ్రా విడిచి వెళ్లనని పవన్ స్పష్టం చేశారు. ఈ దుష్ట ప్రభుత్వం మళ్లీ వస్తే ఏ ఒక్కరిని బతకనివ్వదని ఆయన ఆరోపించారు. జనసేన ప్రభుత్వంలో గూండా గాళ్ల కీళ్లు , కాళ్లు విరగగొడతానని పేర్కొన్నారు. వైసీపీ నాయకుల పేర్లు గుర్తు పెట్టుకోవాలంటేనే తనకు చిరాకన్నారు. తిరుపతి శ్రీవాణి ట్రస్ట్‌లో దోపిడీ జరుగుతోందని.. వైసీపీ ప్రభుత్వం గుండాగాళ్లకు నిలయమన్నారు.