జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శనివారం కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో రైతులు, కౌలు రైతులు పంట నష్టాలు, అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు. త్వరలోనే చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శించనున్నట్టుగా చెప్పారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో రైతులు, కౌలు రైతులు పంట నష్టాల, అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటీ నుంచి 3 వేల మంది రైతులు చనిపోయారని అన్నారు. రాష్ట్రంలో అధికారిక అంచనాల ప్రకారం 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని అన్నారు. అనధికారంగా దాదాపు 45 లక్షల మంది కౌలు రైతులు ఉంటారని చెప్పుకొచ్చారు. అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాల్లోనే 80 కి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఈ పరిస్థితులను చూస్తే సాగును నమ్ముకొన్నవారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం అవుతుందన్నారు. ఉగాది పూట ఆ కుటుంబాలు దుఖంతో, బాధతో ఉండకూడదు.. వారికి కొంతైనా ఊరటను ఇవ్వాలనే ఉద్దేశంతో జనసేన పక్షాన ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించినట్టుగా వెల్లడించారు.
చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున జనసేన ఆర్థిక సహాయం అందచేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ రైతు కుటుంబాలలోని పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతైనా అండ ఇవ్వాలనే ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పారు. ఆర్థిక సాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుందని అన్నారు.
ఈ రోజు తినే తిండి గింజల్లో 80శాతం కౌలు రైతుల కాయకష్టం వల్ల పండినవేనని అన్నారు. అలాంటి కౌలు రైతుల బాధల గురించి తెలుసుకొంటుంటే హృదయం ద్రవిస్తుందని చెప్పారు. కౌలు రైతుకు నిబంధనల పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందటంలేదని చెప్పారు. సాగు చేసుకొంటే రుణం ఇవ్వరని.. పంట నష్టపోతే పరిహారం ఇవ్వరని అన్నారు. ఆత్మహత్య చేసుకున్నవారికీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడంలేదని మండిపడ్డారు. కనీసం అధికారులు కూడా పరామర్శించి విచారించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి కౌలు రైతుకు అండగా ఉంటామని చెప్పారు.
