రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తుందని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  చెప్పారు.  విపక్ష నేతల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందన్నారు.  

హైదరాబాద్: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఆదివారంనాడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో రెండు గంటలకు పైగా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పంలో చంద్రబాబునాయుడిని తిరగకుండా అడ్డుకున్న ఘటనపై మాట్లాడేందుకు వచ్చినట్టుగా చెప్పారు. బ్రిటీష్ కాలం నాటి జీవోను తీసుకు వచ్చారని ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ జీవోను ప్రభుత్వం వెనక్కు తీసుకొనేలా ఏం చేయాలనే దానిపై కూడా తమ మధ్య చర్చ జరిగిందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తొలుత విశాఖపట్టణంలో ఈ పద్దతి ప్రారంభమైందని పవన్ కళ్యాణ్ చెప్పారు. గత ఏడాది అక్టోబర్ లో తన పర్యటనను ఇలానే అడ్డుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలపై చర్చించుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన కొనసాగుతుందన్నారు. వైసీపీ తన బాధ్యతలు గుర్తు చేయాల్సిన అవసరం నెలకొందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రతిపక్ష నేతలకు ఉన్న హక్కులను వైసీపీ కాలరాస్తుందన్నారు. వీటన్నింటికి బ్రేక్ పడాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పెన్షన్లు, రైతు సమస్యలపై కూడా చర్చించినట్టుగా పవన్ కళ్యాణ్ వివరించారు. 

also read:సంక్రాంతి మామూళ్ల కోసం, గంగిరెద్దు మాదిరిగా : చంద్రబాబుతో పవన్ భేటీపై వైసీపీ తీవ్ర విమర్శలు

తమ మీద తమ వాళ్లతో దాడులు చేయించుకోవడం , తమ ఇళ్లను తమ వారితో తగులబెట్టుకొనే సంస్కృతి వైసీపీ నేతలదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దాడులు, దౌర్జన్యాలతో తమ మిత్రపక్షమైన బీజేపీతో కూడా చర్చిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. పోలీసులు నిస్తేజంగా ఉండడం వల్లే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తన విశ్వరూపం చేపిస్తుందని పవన్ కళ్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎన్ని రకాల అరాచకాలు చేయాలో వైసీపీ అన్నీ చేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.