రాజకీయంగా తప్పించేందుకు కుట్ర...
- ‘రాజకీయంగా తప్పించేందుకు కుట్ర జరుగుతోంది’...ఇది తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య.
‘రాజకీయంగా తప్పించేందుకు కుట్ర జరుగుతోంది’...ఇది తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య. సోమవారం ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం సందర్భంగా బహిరంగసభ జరిగింది. అప్పుడు మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తర్వాత తనను రాజకీయంగా తప్పించేందుకు చంద్రబాబు అధికారంలో ఉన్న మరికొందరు పెద్దలతో కలసి పెద్ద ఎత్తున కుట్ర పన్నినట్లు ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా సరే, ప్రజాబలంతో తాను అన్నింటిని ఎదుర్కొంటానని జగన్ తెలిపారు. వైఎస్సాఆర్ పోతు పోతూ తనకు ఇచ్చిన ఆస్తే ప్రజామద్దతు అంటూ వివరించారు.
ప్రజామద్దతు ఉన్నంత వరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాను కూడా వ్యక్తం చేసారు. 2019 ఎన్నికల్లో ప్రజామద్దతుతోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని కూడా చెప్పారు. అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అన్నీ పనులు చేసిన తర్వాతే వాటిని చూపించి 2024 ఎన్నికల్లో జనాలను ఓట్లు అడుగుతామని ప్రకటించారు.
పాదయాత్రలో భాగంగా జనాల నుండి స్వీకరించిన సలహాలు, సూచనలతో మ్యానిఫెస్టోను రూపొందిస్తామని చెప్పారు. తమ మ్యానిఫెస్టో చంద్రబాబునాయుడు మ్యానిఫెస్టోలాగా పుస్తకాలకు పుస్తకాలుండవన్నారు. కేవలం 2 పేజీలు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసారు. చంద్రబాబునాయుడు లాగ 600 తప్పుడు హామీలివ్వకుండా కేవలం చేయగలిగిన పనులను మాత్రమే హామీల రూపంలో మ్యానిఫెస్టోలో ప్రకటిస్తామన్నారు.