వైఎస్ జగన్ ఈ నెల 27 నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. 21 రోజులపాటు ఈ యాత్ర సాగే అవకాశం ఉన్నది. ఆ తర్వాత పూర్తిగా ఎన్నికల ప్రచారమే ఉండనుంది. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. సిద్ధం సభలతో ఇప్పటికే సీఎం జగన్ వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇప్పుడు మరోసారి బస్సు యాత్రతో హుషారు నింపనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజే సీఎం జగన్ వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఇప్పుడు జగన్ ఫోకస్ క్యాంపెయినింగ్ పై పెట్టారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మార్చి 27వ తేదీ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభించనున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 26 లేదా 27వ తేదీన ప్రారంభించనున్నట్టు వైసీపీ నాయకులు వెల్లడించారు. ఇడుపులపాయ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానున్నట్టు తెలిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. 

21 రోజులపాటు జరిగే ఈ బస్సు యాత్ర అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ ప్లాన్ చేశారు. సిద్ధం సభలు జరిగిన నాలుగు జిల్లాలు మినహా మిగిలిన పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ యాత్ర సాగనుంది. ఉదయం పూట ఆయా ప్రాంతాల్లోని మేధావులు, స్థానిక ప్రజలతో సీఎం మాట్లాడుతారని, పాలన మరింత మెరుగుపరచడానికి సలహాలు, సూచనలు తీసుకుంటారు. సాయంత్రం పూట బహిరంగ సభలో మాట్లాడుతారని వైసీపీ వెల్లడించింది. ఈ యాత్ర కోసం బయల్దేరిన జగన్ ప్రజలతోనే మమేకం అవుతూ ఉంటారు. ఈ బస్సు యాత్రలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రసంగాలు ఉండనున్నాయి. ఈ యాత్ర ముగిసిన తర్వాత పూర్తిగా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారమే ఉండనుంది.

ఈ బస్సు యాత్ర గురించి రేపు పూర్తిగా షెడ్యూల్, వివరాలు వెల్లడిస్తామని వైసీపీ పేర్కొంది.