ఇపుడే కళ్ళు తెరిచిన వెంకయ్య
వెంకయ్య చేసిన వ్యాఖ్యలను బట్టిచూస్తే ఎవరికైనా అసలు వెంకయ్య ఇంతకాలం దేశంలోనే ఉన్నారా అన్న అనుమానం రాకమానదు.
వెంకయ్యనాయుడు ఇప్పుడే కళ్లు తెరిచినట్లున్నారు. లేకపోతే అసలు ఇంతకాలం దేశంలోనే లేరో? రైతులతో వెంకయ్య ఢిల్లీలో మాట్లాడిన తీరు చూస్తే ఎవరికైనా అదే అనుమానం వస్తుంది. ఈరోజు అమరావతి ప్రాంతం తనను కలవటానికి వచ్చిన కొందరు రైతులతో వెంకయ్య మాట్లాడుతూ, అభివృద్ధి కోసం ఒకే ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టుకుని వేలాడటం మంచిదికాదని వ్యాఖ్యానించారు. వెంకయ్య చేసిన వ్యాఖ్యలను బట్టిచూస్తే ఎవరికైనా అసలు వెంకయ్య ఇంతకాలం దేశంలోనే ఉన్నారా అన్న అనుమానం రాకమానదు. ఎందుకంటే, రాష్ట్రం విడిపోయిన దగ్గర నుండి చంద్రబాబునాయుడు ప్రతీ అభివృద్ధికి అమరావతినే వేదికగానే చేస్తున్నారు.
అభివృద్ధి పేరుతో దేశ, విదేశాలనుండి ఏ ప్రతిపాదన వచ్చినా దాన్ని అమరావతి ప్రాంతానికే తీసుకెళుతున్నారు. తానే స్వయంగా ఓసారి అసెంబ్లీలో ఏ జిల్లాలో ఏ రంగాన్ని అభివృద్ధి చేయదలచుకున్నదీ చదవి వినిపించారు. అయితే, ఆ తర్వాత పట్టించుకులేదనుకోండి అదివేరే సంగతి. పైగా ప్రతీ అభివృద్ధినీ తీసుకొచ్చి అమరావతిలోనే పెట్టటం మంచిది కాదని వెంకయ్య హితవుపలకటం గమనార్హం. విచిత్రమేమిటంటే, రెండున్నర ఏళ్ళ తర్వాత మొత్తం (కాగితాలపైనే) అభివృద్ధికి అమరావతిని చంద్రబాబు కేంద్రంగా చేసేసిన తర్వాత తీరిగ్గా ఇపుడు వెంకయ్య స్పందించట గమనార్హం.
అమరావతి మరో హైదరాబాద్ లా కాకూడని ఇపుడు సుద్దలు చెబుతున్న వెంకయ్య ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదన్నదే సందేహం. పైగా అన్నీ ప్రాంతాలూ సంతోషంగా ఉండాలంటే అభివృద్ధి అన్నీ జిల్లాల్లోనూ జరగాలట. ఏపికి కేంద్రం నుండి పూర్తి సహకారం అందుతోందన్న అరిగిపోయిన రికార్డునే వినిపించారు లేండి మళ్ళీ. పనిలో పనిగా ఇప్పటికే హోదా పొందిన రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని చెప్పటం గమనార్హం.