హై కోర్టులో విచారణ...చింతమనేనికి షాక్ తప్పదా?
- కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వట్టి వసంతకుమార్ పై చింతమనేని దాడి చేశారు.
దెందులూరు టిడిపి ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ కు షాక్ తప్పదా? న్యాయ నిపుణులు అవుననే అంటున్నారు. శుక్రవారం హై కోర్టులో విచారణ సందర్భంగా ఎంఎల్ఏకి ఎదురు దెబ్బ తప్పదని అంటున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వట్టి వసంతకుమార్ పై చింతమనేని దాడి చేశారు. ఎంఎల్ఏ దాడిపై మంత్రి భద్రతా సిబ్బంది ఫిర్యాదు చేశారు. తర్వాత కేసును విచారించిన భీమడోలు కోర్టు ఎంఎల్ఏకి 2 ఏళ్ళ జైలుశిక్ష విధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ శిక్ష గనుక అమలైతే చింతమనేని ఎంఎల్ఏ పదవి రద్దవుతుంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి కూడా అనర్హుడవుతారు.
అందుకే శిక్ష నుండి తప్పించుకోవటానికి చింతమనేని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లా కోర్టులో అప్పీలు చేసుకున్నారు. అయితే, భీమడోలు కోర్టు తీర్పునే జిల్లా కోర్టు కూడా సమర్ధించింది. దాంతో చేసేది లేక చింతమనేని హై కోర్టును ఆశ్రయించారు. గురువారం జరగాల్సిన విచారణ ఈరోజు జరుగుతుంది. నిజానికి భీమడోలు కోర్టు విధించిన శిక్షతోనే చింతమనేని సభ్యత్వం ఈపాటికే రద్దవ్వాల్సింది. కాకపోతే ఎంఎల్ఏ అధికారపార్టీ సభ్యుడవటంతో నిబంధనలను కూడా పక్కన పెట్టేశారు. మరి, ఈరోజు విచారణలో ఏం జరుగుతుందో చూడాలి.