ఫిరాయింపు మంత్రిపై చంద్రబాబు ఆగ్రహం?..జగన్ పై ఎదురుదాడి
- అసలే సమస్యలతో ఇబ్బంది పడుతున్న చంద్రబాబుకు వాటాలపై ఫిరాయింపు మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇరకాటంలో పడ్డారు.
ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డిపై చంద్రబాబునాయుడు తీవ్రస్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారా? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. అసలే సమస్యలతో ఇబ్బంది పడుతున్న చంద్రబాబుకు వాటాలపై ఫిరాయింపు మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇరకాటంలో పడ్డారు. తనకు, ప్రత్యర్ది, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డికి అవినీతి సంపాదనలో వాటాలున్నాయంటే అది వేరే సంగతి. కానీ అంతటితో ఆగని ఫిరాయింపు మంత్రి తమ మధ్య చంద్రబాబే పంచాయితీ చేశారంటూ బహిరంగంగా చెప్పటం పార్టీలో కలకలం రేగింది.
ఎప్పుడైతే మంత్రి వ్యాఖ్యలు వైరల్ గా మారాయో వెంటనే సిఎం కార్యాలయం, పార్టీ సీనియర్ నేతలు అప్రమత్తమయ్యారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను, పర్యవసానాలను చంద్రబాబుతో ప్రస్తావించారట. ఎందుకంటే, మంత్రి వ్యాఖ్యల వీడియో, ఆడియోలు అప్పటికే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వానికి, పార్టీకి బాగా డ్యామేజ్ మొదలైంది. దాంతో చంద్రబాబు మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
వెంటనే మీడియా సమావేశం పెట్టి తన వ్యాఖ్యలను సమర్ధించుకోవటమే కాకుండా వైసిపిపై ఎదురుదాడి చేయాలంటూ ఆదేశించారట. దాంతో తన వ్యాఖ్యలను సమర్ధింకునేందుకు ఫిరాయింపుమంత్రి నానా అవస్తలు పడుతున్నారు. అందులో భాగమే వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఎదురుదాడి మొదలుపెట్టారు.
అవినీతి సంపాదనలో వాటాల గురించి స్వయంగా చెప్పి వీడియో, ఆడియోల్లో అడ్డంగా దొరికిన తర్వాత మంత్రి అడ్డుగోలు సమర్ధన విచిత్రంగా ఉంది. తన వ్యాఖ్యలను సమర్ధించుకునేందుకు ఏమీ లేక జగన్ తాత వైఎస్ రాజారెడ్డి దగ్గర నుండి మొదలుపెట్టారు. జగన్, విజయసాయిరెడ్డి మీదున్న కేసులను ప్రస్తావించారు. తాను అనని మాటలను అన్నట్లుగా జగన్ మీడియా అసత్య ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. పైగా జగన్ చేస్తున్న తప్పులను భరించలేకే తాను వైసిపిలో నుండి బయటకు వచ్చేశానంటూ అడ్డుగోలు సమర్ధనొకటి.