ఏపీలో స్వాతంత్య్ర వేడుకలు.. విజయవాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్
దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు
‘‘స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె. జాతీయ జెండా మన స్వాతంత్రానికి, ఆత్మగౌరవానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక. స్వాతంత్ర్య పోరాటం శాంతియుతంగా సాగింది. వాదాలు వేరైనా స్వాతంత్య్ర సమరయోధులు.. దేశ స్వాతంత్రం గమ్యంగా పోరాడారు. వాళ్లను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అహింసే ఆయుధంగా, సత్యయే సాధనంగా సాగిన శాంతియుత పోరాటం.. ప్రపంచ మానవాళికి మోహోన్నత చరిత్రగా నిలిచే ఉంటుంది.
భారతదేశం 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించింది. ప్రపంచంతో పోటీ పడి ప్రగతి సాధిస్తోంది. ఆహారం, ఔషధాలు, ఆఖరికి స్మార్ట్ ఫోన్ల రంగంలోనూ దేశం టాప్ లిస్ట్లో కొనసాగుతోంది. ఏపీలో మూడేళ్ల పాలనలో అనేక సంస్కరణలు అమలు చేశాం. అనేక వర్గాలను దోపిడీల బారి నుంచి కాపాడాం’’ అని జగన్ పేర్కొన్నారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఎగరవేశారు. శాసనమండలి ప్రాంగణంలో ఏపీ ఛైర్మన్ మోషేన్రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.