అధికారుల పనితీరుకు.. ఎమ్మెల్యే వినూత్న నిరసన

అధికారుల పనితీరు సరిగా లేదని ఓ ఎమ్మెల్యే నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆఫీసు ఎదుట నేలపై బైఠాయించి ఆందోళన తెలియజేశారు. ప్రజల మెప్పు పొందేందుకు ఆయన చేసిన పని ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడుకే తలనొప్పిగా మారేలా ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇంతకీ విషయం ఏమిటంటే.. పశ్చిమగోదావరి జిల్లా డెల్టా ఆధునీకరణ పనుల్లో ఇరిగేషన్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా పనులు సాగడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. తమ ఎమ్మెల్యే తమ కోసం పోరాడుతున్నాడనే భావన ప్రజల్లో కలిగితే కలిగి ఉండొచ్చు. అయితే.. ఎమ్మెల్యే చేపట్టిన నిరసన చివరకు సీఎంకే ఎసరు పెట్టేలా మారింది.

ఎందుకంటే.. ఇరిగేషన్ వ్యవహారాలన్నీ ముఖ్యమంత్రే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆయన నిధులు విడుదల చేస్తేనే ఆధునీకరణ పనులు సాగేది. ఒక వేళ సీఎం నిధులు విడుదల చేసినా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరించి సకాలంలో పనులు పూర్తి చేయకపోతే.. దానిని ప్రశ్నించే అధికారం, చర్యలు తీసుకునే హక్కు కూడా సీఎం కే ఉంది. అంటే.. ఈ వ్యవహారమంతా సీఎం తో ముడిపడి ఉంది. ఈ విషయం గురించి ఎమ్మెల్యేకి అవగాహన ఉందో లేదో తెలీదు కానీ.. అధికారుల పనితీరుపై మాత్రం విరుచుకుపడ్డాడు.

ఒకవేళ ఇదంతా సీఎం చేతిలో పని అని తెలిసినా.. డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని ప్రశ్నించలేని పరిస్థితి ఎమ్మెల్యేది. ఎందుకుంటే సీఎంని ప్రశ్నిస్తే..వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందో లేదో అనే భయం. అందుకే ఆయనని అనలేక ఇలా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనే వాదన వినపడుతోంది.