ఎక్కడి నుంచి పోటీ చేస్తానో అప్పుడే చెబుతా: పవన్
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తాను ఏ స్థానం నుండి పోటీ చేస్తానో ప్రకటిస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.
అనంతపురం: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తాను ఏ స్థానం నుండి పోటీ చేస్తానో ప్రకటిస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజకీయపార్టీ నేతలు తమ స్వార్థం కోసమే పార్టీలను నడుపుతున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
గతంలో అనంతపురం జిల్లా నుండి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ప్రకటనతో ఇంకా పవన్ ఏ జిల్లా నుండి పోటీ చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
అనంతపురం జిల్లాలో జనసేన పోరాట యాత్రలో పవన్ పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా గురువారం నాడు అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
మహిళలు, యువతే లక్ష్యంగా జనసేన పార్టీని నడుపుతున్నామని పవన్ అన్నారు. యువత, మహిళలతో పాటు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలోని అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు జనసేన పోటీ చేస్తోందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అనంతపురం జిల్లాలో కరువు నివారణ కోసం తెచ్చిన రెయిన్ గన్లకు అనంతపురం రైతులకు ఏ మాత్రం ఉపయోగం లేదన్నారు. అనంతపురంలో కరవు నివారణకు సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ అసలు అసెంబ్లీకే వెళ్లడం లేదనీ, కరవుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు.
సంబంధిత వార్తలు
సందేశమైతే ఇచ్చారు: తెలంగాణలో మద్దతుపై తేల్చని పవన్(వీడియో)