నాన్న అడుగు జాడల్లో నడుస్తున్నా: కాంగ్రెస్లో చేరిన తర్వాత వై.ఎస్.షర్మిల
కాంగ్రెస్ పార్టీ అప్పగించిన బాధ్యతలను తాను నిర్వహిస్తానని వై.ఎస్.షర్మిల ప్రకటించారు.
న్యూఢిల్లీ: తాను తన మా నాన్న వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తున్నానని వై.ఎస్. షర్మిల ప్రకటించారు. గురువారంనాడు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టుగా వై.ఎస్. షర్మిల ప్రకటించారు. న్యూఢిల్లీలోని ఎఐసీసీ కార్యాలయంలో మలికార్జున ఖర్గే , రాహుల్ గాంధీ సమక్షంలో వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి మల్లికార్జున ఖర్గే వై.ఎస్. షర్మిలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వై.ఎస్. షర్మిల మాట్లాడారు.
also read:వైఎస్ఆర్టీపీ విలీనం: కాంగ్రెస్లో చేరిన వై.ఎస్. షర్మిల
దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని ఆమె ప్రకటించారు. దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ అని ఆమె చెప్పారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్టుగా వై.ఎస్. షర్మిల తేల్చి చెప్పారు.కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణలో పోటీ చేయలేదని వై.ఎస్. షర్మిల వివరించారు.రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది మా నాన్న కలగా షర్మిల పేర్కొన్నారు.వైఎస్ఆర్టీపిని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తన జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేశారన్నారు.
మణిపూర్ లో చర్చిలను ధ్వంసం చేయడం తనను కలిచివేసిందన్నారు. దేశంలో సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోవడంతో ఈ ఘటన జరిగిందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా సమర్ధవంతంగా పనిచేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనైనా అండమాన్ లోనైనా ఎక్కడ పనిచేయాలని పార్టీ ఆదేశిస్తే అక్కడ పనిచేస్తానని షర్మిల తేల్చి చెప్పారు. వైఎస్ఆర్టీపీ విలీనం సమయంలో ఎలాంటి షరతులు పెట్టలేదని ఆమె చెప్పారు.