రాజకీయాల్లోకి చెన్నుపాటి శ్రీనివాస్: ఏ పార్టీలో చేరతారంటే?
రంగా, రాధా మిత్రమండలితో సంప్రదింపులు
విజయవాడ:ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని మరో రెండు రోజుల్లో వెల్లడిస్తానని వంగవీటి మోహానరంగా బావమరిది చెన్నుపాటి శ్రీనివాస్ చెప్పారు.అయితే శ్రీనివాస్ ఏ పార్టీలో చేరతారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చెన్నుపాటి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.వంగవీటి రాధా, రంగాల ఆశయసాధన కోసం ఏ పార్టీ పనిచేస్తోందో ఆ పార్టీలో చేరతానని ఆయన ప్రకటించారు.
ఏ నిర్ణయం తీసుకున్నా రంగా, రాధా మిత్రమండలి అభిప్రాయం మేరకే తీసుకుంటానని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన రంగా, రాధా మిత్రమండలి సమావేశానికి రెండు వేలకు పైగా సభ్యులు హాజరయ్యారు.
వంగవీటి రాధా, రంగా మిత్ర మండలి సభ్యులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన ప్రకటించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రంగా, రాధాలు ఎంతో కృషి చేశారని కొనియాడారు.