విజయనగరం జిల్లాలో భార్యను హత్య చేసిన భర్త


విజయనగరం: విజయనగరం జిల్లా వెంకంపేట ఏజెన్సీలో రమణమ్మ అనే వివాహితను భర్త నర్సయ్య హత్య చేసి బాత్‌రూమ్‌లోనే పూడ్చిపెట్టాడు. సుమారు 8 మాసాల తర్వాత రమణమ్మ మృతదేహన్ని పోలీసులు వెలికి తీశారు. కొంతకాలంగా రమణమ్మ అదృశ్యమైందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి నుండి భర్త నర్సయ్య తప్పించుకు తిరుగుతున్నాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

2017 అక్టోబర్ మాసంలో రమణమ్మను ఆమె భర్త నర్సయ్య అత్యంత దారుణంగా హత్య చేశాడు. అంతేకాదు మృతదేహన్ని బాత్‌రూమ్ లో పూడ్చిపెట్టాడు. భార్య కన్పించడం లేదని ఆమె కుటుంబసభ్యులకు సమాచారాన్ని ఇచ్చాడు. అంతేకాదు తాను కూడ ఆమె కోసం వెతుకుతున్నట్టుగా నాటకం ఆడాడు.

అయితే రమణమ్మ కుటుంబసభ్యులకు మాత్రం భర్తపైనే ఉంది.ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రమణమ్మ అదృశ్యమైన నాటి నుండి హైద్రాబాద్, విశాఖపట్టణాల్లో మాత్రమే నర్సయ్య తలదాచుకొంటున్నాడు. వెంకంపేట ప్రాంతానికి రావడం లేదు.

అయితే జూన్ 17వతేదిన విశాఖకు వచ్చిన నర్సయ్యను రమణమ్మ బంధువులు చూశారు. అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నర్సయ్య అసలు విషయాన్ని చెప్పారు. కుటుంబ కలహల నేపథ్యంలో రమణమ్మను హత్య చేసి బాత్‌రూమ్‌లో పూడ్చివేసినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు బాత్ రూమ్ వద్ద తవ్వి రమణమ్మ మృతదేహన్ని వెలికితీశారు.

కుటుంబ కలహల నేపథ్యంలో భార్య, భర్తలు తరచుగా గొడవపడేవారు. ఈ కారణంగానే ఈ దంపతుల పెద్ద కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన నర్సయ్య భార్యను చంపేశాడు. మృతదేహన్ని బాత్ రూమ్ లో వేసి పూడ్చిపెట్టినట్టు నిందితుడు ఒప్పుకొన్నాడు.