ఇంద్రకీలాద్రిపై దర్శనాల రచ్చ : పోలీస్ ప్రోటోకాల్ వాహనాల్లో అధికారుల బంధువులు.. సామాన్యుల ఇక్కట్లు
దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ దర్శనాలపై వివాదం కొనసాగుతోంది. కలెక్టర్, సీపీ, మంత్రి ఆదేశాలను బేఖాతరు చేస్తూ పోలీసులు.. వారి బంధువులను ప్రోటోకాల్ వాహనాల్లో తీసుకురావడంపై భక్తులు మండిపడుతున్నారు.
దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరోసారి దర్శనాల రచ్చ జరిగింది. ఆదివారం మూలా నక్షత్రం కావడంతో భక్తులు పోటెత్తడంతో కొండపై క్యూలైన్స్ నిండిపోయాయి. సరస్వతి దేవి రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. అయితే మూలా నక్షత్రం రోజు కూడా పోలీస్ ప్రోటోకాల్ వాహనాలు ఆగడం లేదు. యదేచ్ఛగా పోలీస్ వాహనాల్లో వారి బందువులు ఆలయానికి వస్తున్నారు. కలెక్టర్, సీపీ, మంత్రి ఆదేశాలను పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే రెండు లక్షల మంది భక్తులు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా క్యూలైన్లో లక్ష మంది భక్తులు వేచి వున్నట్లుగా తెలుస్తోంది.
ఇకపోతే.. కనకదుర్గ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దర్శించుకున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూల నక్షత్రం రోజైన నేడు కనదుర్గమ్మకు సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇందుకోసం సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంద్రకీలాద్రికి చేరుకన్నారు. అక్కడ సీఎం జగన్కు వేదపండితులు, దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ALso Read:ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
అనంతరం సీఎం జగన్ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలు కూడా అందజేశారు. అమ్మవారి దర్శనం చేసుకని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎం జగన్కు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం సీఎం జగన్కు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీఎం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నందున.. 45 నిమిషాల పాటు భక్తుల దర్శనాలను నిలిపివేశారు.