అమరావతిలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు, కోటీ ఇరవై లక్షల చోరి
మహిళలపై దాడి...నగదుతో పాటు బంగారం కూడా చోరీ
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాములలోని ఓ ఇంట్లో చొరబడిన దొంగలు, ఆయధాలతో మహిళల్ని బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ దొంగలు నగదుతో పాటు, బంగారు నగలను తీతసుకెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు.
ఈ చోరీకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెనుమాములలో నివాసముండే బ్రహ్మానంద రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. ఇంట్లో మగాళ్లు ఎవరూ లేని సమయం చూసి ముగ్గురు దొంగలు బైక్ పై వచ్చారు. ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలకు ఆయుధాలు చూపించి బెదిరించి వారిని తాళ్లతో కట్టెశారు. వారిని బెదిరించి డబ్బులు, నగదు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వాటిని తీసుకుని పరారయ్యారు.
ఈ దొంగతనంలో సుమారు కోటి ఇరవై లక్షల రూపాయల నగదు, 20 కాసుల బంగారు నగలను దుండుగులు ఎత్తుకు పోయినట్టు బాధితులు చెబుతున్నారు. దుండగులు మాస్కులు ధరించి మారణాయుధాలతో వచ్చారని ఇంట్లో వున్న మహిళలు తెలిపారు.
ఈ దొంగతనం గుురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్వాడ్ లను రప్పించి ఆధారాల కోసం వెతుకుతున్నారు. ఈ దోపిడిపై కేసు నమోదు చేశామని, దొంగలను పట్టుకోడానికి ప్రత్యేకంగా గాలింపు చేపడుతున్నట్లు రాజధాని పోలీసులు తెలిపారు.