ఫుల్లుగా తాగేసారు
- అమరావతి బాగా అభివృద్ధి జరిగింది.
అమరావతి బాగా అభివృద్ధి జరిగింది. ఏంటి నిజమేనా అని అనుకుంటున్నారా? నిజమేనండి. కాకపోతే రాజధాని నిర్మాణంలోనో, పారిశ్రామికంగానో లేక ఇంకో రకంగానో అనుకునేరు. మద్యం అమ్మకాల్లో, తాగటంలోనే సుమా. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే గుంటూరు, కృష్ణాజిల్లాలు ప్రత్యేకించి అమరావతి ప్రాంతంలో బాగా ఎక్కువగా మందు తాగేసారట. దాంతో అమరావతి ఎంతగా అభివృద్ధి చెందిందో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే, డిసెంబర్ 26-31 తేదీల మధ్య రాష్ట్రం మొత్తం మీద దాదాపు రూ. 470 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అందులో 31వ తేదీన మాత్రమే రూ. 230 కోట్ల మద్యాన్ని ఊదేసారు. ఇందులో కూడా అమరావతి ప్రాంతంలో మాత్రమే రూ. 50 కోట్ల విలువైన మద్యాన్ని తాగేసారట.
విచిత్రమేమిటంటే, ఖజానాకు ఆదాయం పెంచుకోవటం కోసం మద్యం తాగేట్లుగా మద్యం ప్రియులను ప్రభుత్వమే బాగా ప్రోత్సహిస్తోంది. ఇంకోవైపు మద్యం తాగేసి బండ్లు నడుపుతున్నారంటూ పోలీసులు ఎక్కడికక్కడ నిలిపి ఫైన్లు వేస్తున్నారు. అంటే మద్యం అమ్మకాలపైనే కాకుండా మద్యం తాగిన వారికి ఫైన్లు వేయటం ద్వారా కూడా ప్రభుత్వం ఆదాయాన్ని సంపాదించుకుంటోంది.