నెల్లూరు వర్శిటీ పై విచారణ : పవన్ జోక్యంతో కదిలిన గంట
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంపై అవినీతి అరోపణలు
నెల్లూరు యూనివర్శిటీ విద్యార్థులకు జనసేన నాయకుడు పవన్ కల్యాన్ అండగా నిలవడంతో రాష్ట్ర మావన వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు.
నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆందోళలు, ధర్నాలతో,అనంతరం విద్యార్థులు జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ ను కలుసుకునేందుకు జరిపిన హైదరాబాద్ యాత్ర చేయడం,ఆ పైన పవన్ విద్యార్థులకు మద్ధతు తెలపడంతో ప్రభుత్వం స్పందించింది. విక్రమ సింహపురి యూనివర్శిటీలో జరుగుతున్న అవినీతి అరోపణలపై హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసామని మంత్రి గంట వెల్లడించారు.
గత వారంలో రామోజీ ఫిల్మ్ సిటిలో ‘కాటమరాయుడు’ షూటింగ్ లో ఉన్న పవన్ ను విద్యార్థులు కలుసుకుని యూనివర్శిటీ లో జరుగుతున్నఅవకతవకల మీద వినతి పత్రం సమర్పించిన సంగతి తెలిసిందే.
విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలుపుతూ, ఈ ఆరోపణలలో నిజానిజాలను తెలుసుకునేందుకు ఒకఉన్నత స్థాయి కమిటీ నియమించాలని ఆయన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేశారు. పర్యవసానంగా గంటా నెల్లూరు పర్యటన ఏర్పాటు చేసుకున్నారు.
ఈరోజు నెల్లూరొచ్చిన ఆయన నెల్లూరు సమీపంలోని కాకుటూరులో కొత్తగా నిర్మించిన యూనివర్శిటీ భవనాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్దులు ఎదుర్కొంటున్న సమస్యలపై వీసీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ యూనివర్శిటీలో ఎవ్వరు తప్పు చేసినా ఊపేక్షించడమనేది ఉండదని చెప్పారు. తప్పు చేస్తే రిజిస్టార్ అయినా, వీసీ అయినా చర్యలుంటాయని, ఆరోపణల మీద ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తామని ప్రకటించారు.