రాజు గారు ఓవర్ చేస్తున్నారు
- సహజశైలికి భిన్నంగా కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
సహజశైలికి భిన్నంగా కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పదే పదే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మంగళవారం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న రాజుగారు మాట్లాడుతూ, జగన్ రూ. 43 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నట్లు ఆరోపించారు. నిజానికి జగన్ అవినీతికి పాల్పడినట్లు ఇంత వరకూ ఏ ఒక్క కేసులోనూ నిరూపణ కాలేదు. జగన్ పై సిబిఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులన్నీ వివిధ కోర్టుల్లో విచారణ దశలోనే ఉన్నాయి.
నిజానికి కేసుల విచారణ పూర్తయి నేరం నిరూపణ అయ్యే వరకూ ఎవరినీ దోషి అనేందుకు లేదు. అటువంటిది రాజుగారే తీర్పు ఇచ్చేసినట్లున్నారు చూడబోతే. జగన్ రూ. 43 వేల కోట్ల ప్రజాధానాన్ని లూటీ చేసారని అంటున్న కేంద్రమంత్రి తన ఆరోపణలను నిరూపించగలరా? అసలు కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులపై బాధ్యత గల పదవిలో ఉన్న కేంద్రమంత్రి సొంత తీర్పు ఎలా చెబుతున్నారో అర్దం కావటం లేదు. అవినీతిపరులను ఎన్నికల్లో గెలిపించొద్దని చెప్పటం వరకూ బాగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆ విషయాన్ని తేల్చాల్సింది జనాలు కదా?