వరలక్ష్మి హత్య సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుతోందని హోంమంత్రి సుచరిత తెలిపారు. 

 విశాఖపట్నం: గాజువాకలో ప్రేమోన్మాది చేతిలో బలైన వరలక్ష్మి కుటుంబ సభ్యులను హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత పరామర్శించారు. హోంమంత్రితో పాటు కలెక్టర్ వినయ్ చంద్, దిశ స్పెషల్ ఆఫీసర్ కృత్తికా శుక్లా, దీపికా పాటిల్, డీసీపీ ఐశ్వర్య రాస్తోగి, ఇతర పోలీస్ అధికారులు పరామర్శించారు. వరలక్ష్మి హత్యసంఘటన గురించి తల్లిదండ్రులు హోంమంత్రి కి వివరించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నిందితుడు అఖిల్ కు మరికొంత మంది సహకరించారనే అనుమానం ఉందని వరలక్ష్మి పేరెంట్స్ తెలిపారు. నిందితుడు తండ్రికి రౌడీ షీటర్ల తో సంబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడి కుటుంబం నుండి తమకు ప్రాణహాని ఉందని వరలక్ష్మి తండ్రి గురునాథరావు హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై హోంమంత్రి సుచరిత తక్షణం స్పందించారు. పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి వరలక్ష్మి కుటుంబానికి ప్రత్యేక రక్షణ కల్పించాలని ఆదేశించారు. 

వరలక్ష్మి హత్య సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుతోందని హోంమంత్రి సుచరిత తెలిపారు. దిశ ప్రకారం నిందితుడుకి కఠిన శిక్ష పడేలా చూస్తామని
హోంమంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 10 లక్షల రూపాయల చెక్ ను వరలక్ష్మి పేరెంట్స్ కు హోంమంత్రి సుచరిత
అందించారు. భవిష్యత్తు లో వరలక్ష్మి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హోంమంత్రి సుచరిత హామీ ఇచ్చారు.

విశాఖ నగరంలో నడిరోడ్డుపై వరలక్ష్మి గొంతు ను కత్తితో కోసి దారుణానికి ఒడిగట్టాడు అఖిల్ అనే యువకడు. గాజువాక సుందరయ్య కాలనీలో నివాసముండే ఇంటర్మీడియట్ విద్యార్థిని వరలక్ష్మిని సాయిబాబా గుడి వద్ద అఖిల్ అడ్డగించి కత్తితో గొంతుకోశాడు. తీవ్ర రక్త స్రావం అవడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. 

గత కొంత కాలంగా యువతిని ప్రేమ పేరుతో అఖిల్ వేధించాడు. దీంతో వరలక్ష్మి ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు పోలీసుల సాయంతో అఖిల్ ను మందలించారు. దీంతో వరలక్ష్మిపై కోపాన్ని పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.