పార్టీ నుంచి సస్పెన్షన్ .. ఉండవల్లి శ్రీదేవి ఆఫీసును ముట్టడించిన వైసీపీ శ్రేణులు, ఫ్లెక్సీల చించివేత
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ సీరియస్గా స్పందించింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వేటు వేసింది. ఈ నేపథ్యంలో గుంటూరులోని ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గుంటూరులోని తాడికొండ ఎమ్మెల్యే, వైసీపీ బహిష్కృత నేత ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయంలోని సమీపంలో వున్న ఉండవల్లి శ్రీదేవి ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వైసీపీ నేతలు, కార్యకర్తలకు సర్దిచెబుతున్నట్లుగా తెలుస్తోంది.
కాగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన షాక్కి గింగిరాలు తిరుగుతున్న వైసీపీకి .. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు శరాఘాతంలా తగిలాయి. సభలో బలం వుండటంతో పాటు విపక్ష పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేల మద్ధతుతు ఏడు స్థానాలు తన ఖాతాలో పడతాయని భావించిన వైఎస్సార్ కాంగ్రెస్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన వ్యూహంతో షాకిచ్చారు. దీనికి తోడు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడటంతో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ ఎమ్మెల్సీగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై చర్చ జరగుతోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ సీరియస్గా స్పందించింది. ఈ క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వేటు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. వైసీపీ నుంచి ఈ నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది.
వైసీపీ ప్రధాన కార్యదర్శి , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కొక్క ఎమ్మెల్యేకి చంద్రబాబు రూ.15 నుంచి రూ.20 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. క్రాస్ ఓటింగ్పై అంతర్గతంగా విచారణ చేపట్టామని సజ్జల తెలిపారు. ఈ క్రమంలో ఈ నలుగురు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు పార్టీ గుర్తించిందని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని.. అలాగే క్రాస్ ఓటింగ్ చేసినవాళ్లకు టికెట్ ఇస్తామని కూడా టీడీపీ చెప్పి వుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దర్యాప్తు తర్వాతే ఎమ్మెల్యేలపై వేటు వేశామని సజ్జల స్పష్టం చేశారు.