ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ సీరియస్గా స్పందించింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వేటు వేసింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ సీరియస్గా స్పందించింది. ఈ క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వేటు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. వైసీపీ నుంచి ఈ నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది.
వైసీపీ ప్రధాన కార్యదర్శి , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కొక్క ఎమ్మెల్యేకి చంద్రబాబు రూ.15 నుంచి రూ.20 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. క్రాస్ ఓటింగ్పై అంతర్గతంగా విచారణ చేపట్టామని సజ్జల తెలిపారు. ఈ క్రమంలో ఈ నలుగురు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు పార్టీ గుర్తించిందని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని.. అలాగే క్రాస్ ఓటింగ్ చేసినవాళ్లకు టికెట్ ఇస్తామని కూడా టీడీపీ చెప్పి వుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దర్యాప్తు తర్వాతే ఎమ్మెల్యేలపై వేటు వేశామని సజ్జల స్పష్టం చేశారు.
సీట్లు ఇవ్వము అని చివరి వరకు తాము మభ్య పెట్టమని.. వీరిపై నివేదికలు తెప్పించి టికెట్ ఇవ్వడం కుదరదని ముందే చెప్పామని సజ్జల స్పష్టం చేశారు. నలుగురు ఎమెల్యేలు పార్టీ కార్యక్రమాల్లో వెనకబడి ఉన్నారని.. కోట్లాది రూపాయలు వెచ్చించి చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నాయకులూ అనే వాళ్ళు అధినేత నిర్ణయానికి పార్టి నిర్మాణానికి కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. టిడిపితో వెళ్ళాలి అనుకుంటే బహిరంగంగా వెళ్లొచ్చని.. ఇలా సొంత పార్టీకి ద్రోహం చేయాల్సిన అవసరం లేదని సజ్జల దుయ్యబట్టారు. అపోహలు ఉంటే తొలగించే వాళ్లమని, కానీ పార్టీ నిర్ణయాన్ని దిక్కరిస్తే ఉపెక్షించమని ఆయన తేల్చిచెప్పారు.
పార్టీకి సంబంధించి లైన్ దాటితే ఇలాగే ఉంటుందని.. వైసీపీకి ఒక విధానం ఉంటుందని , అది ఎంటో అందరికీ తెలియాలన్నారు. టికెట్ ఇవ్వకుండా తప్పించినంత మాత్రాన వారికి భవిష్యత్ లేనట్లు కాదన్నారు. అసంతృప్తి ఉంటే పార్టీలో ఉండొచ్చు పార్టీ నేతలకు చెప్పొచ్చని సజ్జల సూచించారు. టికెట్ లేకపోతే రాజకీయా భవిష్యత్ సంగతి తాను చూసుకుంటానని సీఎం అందరికీ చెప్పారని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. ఎన్నికలకు సంవత్సరం ముందే టీడీపీలోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలోకి వెళ్ళడానికి కారణాలు డబ్బు కాకుండా ఏముంటాయని సజ్జల నిలదీశారు. వాళ్లు డబ్బులు తీసుకున్నారు అనడానికి ఆధారాలు లేవని.. కాకపోతే అమ్ముడు పోకుండా మరి టీడీపీకి ఓటు ఎందుకు వేస్తారని ఆయన ప్రశ్నించారు. టీడీపీకి అమ్మడం కొనడం అలవాటేనని రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
Also REad:క్రాస్ ఓటింగ్పై వైసీపీ సమీక్ష.. ఫోన్ స్విచ్చాఫ్ చేసి, అజ్ఞాతంలోకి ఆ ఎమ్మెల్యే?.. పలు అనుమానాలు..!
కాగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన షాక్కి గింగిరాలు తిరుగుతున్న వైసీపీకి .. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు శరాఘాతంలా తగిలాయి. సభలో బలం వుండటంతో పాటు విపక్ష పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేల మద్ధతుతు ఏడు స్థానాలు తన ఖాతాలో పడతాయని భావించిన వైఎస్సార్ కాంగ్రెస్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన వ్యూహంతో షాకిచ్చారు. దీనికి తోడు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడటంతో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ ఎమ్మెల్సీగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై చర్చ జరగుతోంది. పలువురి పేర్లు తెరపైకి రావడంతో ఆ ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. పార్టీ ఆదేశాల మేరకు తాను వైసీపీ అభ్యర్ధి జయమంగళ వెంకట రమణకే ఓటు వేశానని ఆయన స్పష్టం చేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత తాను సీఎం జగన్ను సైతం కలిసినట్లు మేకపాటి వెల్లడించారు. కాంగ్రెస్లో వుండగా ఎమ్మెల్యే పదవిని సైతం వదిలేసి.. జగన్ వెంట నడిచిన విషయాన్ని చంద్రశేఖర్ రెడ్డి గుర్తుచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఆధిష్టానం సూచన మేరకు నడుచుకుంటానని ఆయన పేర్కొన్నారు. టికెట్ ఇచ్చినా రాకున్న జగన్ అడుగుజాడల్లో నడుస్తానని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఉదయగిరిలో తానంటే ఏంటో చూపిస్తానని.. తన వెనుక సొంత పార్టీ నేతలే పనిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఫ్లెక్సీలను తాను తొలగించినట్లుగా ప్రచారం చేస్తున్నారని.. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు ఈ పనిచేశారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.
