వైఎస్ జగన్ కు షాక్: ఇంగ్లీష్ మీడియం జీవోలను కొట్టేసిన హైకోర్టు
ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ బిజెపి నాయకుడు సుధీష్ రాంభొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఏ మీడియంలో చదవాలనే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకే వదిలేయాలని పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.
ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేయడం సరి కాదని ఆయన అన్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తే బ్యాక్ లాగ్ లు మిగిలిపోతాయని అన్నారు. అయితే, ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ బుధవారం తీర్పు చెప్పింది. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడాన్ని తెలుగుదేశం, జనసేన వంటి ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందని ఆ పార్టీ నాయకులు వాదించారు. అయితే, ఇంగ్లీష్ మీడియం చదివితేనే భవిష్యత్తు ఉంటుందని వైఎస్ జగన్ వాదిస్తూ వచ్చారు.