ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద నమోదైన కేసుల ఉపసంహరణ వ్యవహారం హైకోర్టు పరిధిలోకి వచ్చింది. జగన్ మీద ఉపసంహరించిన కేసులను హైకోర్టు సూమోటోగా విచారణకు స్వకరించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై నమోదైన వివిధ క్రిమినల్‌ కేసులను పోలీసులు, ఫిర్యాదుదారులు నిబంధనలకు విరుద్ధంగా ఉపసంహరించారనే అభిప్రాయంతో హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టనుంది. మొత్తం 11 క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత ముందుకు నేడు విచారణకు రానున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన పలు కేసులను కొవిడ్‌ సమయంలో పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (పీపీ), సంబంధిత న్యాయాధికారులు నిబంధనలకు విరుద్ధంగా హడావుడిగా ఉపసంహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ కేసుల వివరాలు కూడా హైకోర్టు దృష్టికి వచ్చాయి. 

హైకోర్టు పరిపాలన విభాగం ఈ కేసులను పరిశీలించి సుమోటోగా విచారణకు తీసుకుని, హైకోర్టు రిజిస్ట్రీకి నంబర్లు కేటాయించింది. సుమోటోగా తీసుకున్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, ఫిర్యాదుదారులు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతివాదులుగా ఉన్నారు.

జగన్ మీద నమోదై ఉపసంహరించిన మొత్తం 11 కేసుల్లో అనంతపురం జిల్లాకు సంబంధించినవి అయిదు, గుంటూరు జిల్లాకు సంబంధించినవి ఆరు కేసులు ఉన్నాయి.