అయేషా కేసులో మలుపు: ఆధారాలు ధ్వంసం, సిట్ పై హైకోర్టు వ్యాఖ్య
సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కు సంబంధించి సిట్ విచారణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సోమవారం హైకోర్టులో అయేషా మీరా కేసు విచారణ జరిగింది. హత్య జరిగిన ప్రదేశంలో సేకరించిన ఆధారాలను ధ్వంసం చేశారని ఆయేషా తల్లిదండ్రుల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు.
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కు సంబంధించి సిట్ విచారణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సోమవారం హైకోర్టులో అయేషా మీరా కేసు విచారణ జరిగింది. హత్య జరిగిన ప్రదేశంలో సేకరించిన ఆధారాలను ధ్వంసం చేశారని ఆయేషా తల్లిదండ్రుల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు.
ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు, ఆయేషా మృతదేహంపై ఉన్న వస్తువులు కనుమరుగైనట్లు తెలిపారు. కేసు పునర్విచారణ చేస్తున్న సందర్భంగా సిట్ అధికారులు మెటీరియల్ ఆబ్జెక్ట్స్ తారుమారుపై దృష్టిసారిస్తే నేరం చేసిన వారు ఎవరో తేలుతుందని సూచించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం... కింది కోర్టులో డిపాజిట్ చేసిన మెటీరియల్ ఆబ్జెక్ట్స్ను పరిశీలనకు ఇవ్వమని కోరారా? అని కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ బృందాన్ని ప్రశ్నించింది. అప్పీలు గడువు ముగియకముందే వాటిని ధ్వంసం చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించడం విస్మయానికి గురిచేస్తోందని వ్యాఖ్యానించింది.
జ్యుడీషియరీలో లోపాలుంటే తాము సరిదిద్దుతామని తేల్చి చెప్పింది హైకోర్టు. కింది కోర్టులో డిపాజిట్ చేసిన మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ధ్వంసం అయ్యాయా? ఆ వివరాలు కోరితే కింది కోర్టు ఏ విధంగా స్పందించింది? దర్యాప్తులో వాటి పాత్ర ఏమిటో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని సిట్ అధికారులను ఆదేశించింది.
రుజు మార్గంలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు తీరులో లోపాలున్నట్లు తేలితే మరో సంస్థకు అప్పగించే అంశాన్ని పరిశీస్తామని బెంచ్ వ్యాఖ్యానించింది. అయితే నివేదిక ఇచ్చేందుకు కొంత గడువు కావాలని సిట్ న్యాయవాది, స్పెషల్ జీపీ కృష్ణ ప్రకాష్ కోరారు.
దీంతో ఈ కేసు విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.