కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు జేఏసీ నాయకులు విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జేఏసీ నాయకులు నినాదాలు చేశారు

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. విశాఖ పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్‌కు.. వినతిపత్రం ఇచ్చేందుకు జేఏసీ నాయకులు విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జేఏసీ నాయకులు నినాదాలు చేస్తూ.. ఆందోళనకు దిగారు. నిరసన తెలుపుతున్న స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నిర్మల పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఎయిర్ పోర్ట్ దగ్గర హై అలెర్ట్ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆర్ధిక మంత్రికి వినతులు సమర్పించాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ దగ్గరకు వందల సంఖ్యలో కార్మికులు వస్తారని పోలీసులకు ముందస్తు సమాచారం అందటంతో విమానాశ్రయం దగ్గర హై అలర్ట్‌ ప్రకటించారు. ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అనుమతించారు. అటు మీడియా డీఎస్‌ఎన్‌జీలను ఎయిర్ పోర్ట్‌లోకి వెళ్ళేందుకు అనుమతి నిరాకరించారు.