ఆంధ్రప్రదేశ్‌‌లోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌‌లోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాలు, రాయలసీమ ప్రాంతంలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కొమోరిన్ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, మంగళవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం నెలకొంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో కొన్ని చోట్ల, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి.

ఇదిలాఉంటే, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వచ్చే రెండు రోజులు తెలంగాణలోని పలుచోట్ల కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.