చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో వర్షబీభత్సం... సహాయక చర్యలకోసం ప్రత్యేక అధికారుల నియామకం
వాయుగుండం ప్రభావంతో వర్షాల తాకిడి ఎక్కువగా వున్న రాయలసీమ జిల్లాలు కడప, చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లాలో సహాయక చర్యల పర్యవేక్షణకై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో ఈ వర్షతీవ్రత ఎక్కువగా వుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిపరిస్థితులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకునేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.
chittoor, nellore, kadapa districts లో వరద సహాయక పనుల పర్యవేక్షణను ప్రత్యేక అధికారులు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి ys jaganmohan reddy ఆదేశాల మేరకు గత రాత్రే అధికారులు ఆయా జిల్లాలకు చేరుకున్నారు. భారీ వర్షాల వల్ల సంభవిస్తున్న వరదల నేపథ్యంలో సహాయ చర్యలను ఆ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్ కు నివేదిస్తారు.
నెల్లూరు జిల్లాకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, చిత్తూరు జిల్లాకు మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, వైయస్సార్ జిల్లాకు మరో సీనియర్ అధికారి శశిభూషణ్ కుమార్ను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిన వెంటనే వీరు వెంటనే తమ పనుల్లో నిమగ్నమయ్యారు.
read more తీరందాటిన వాయుగుండం... దక్షిణాంధ్ర, రాయలసీమలో అతిభారీ, తెలంగాణలో భారీ వర్షాలు
ఇక నెల్లూరు జిల్లాలో వర్షాలు, వరదలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులతో సమావేశమైన మంత్రి anil kumar yadav వరద సహాయక చర్యలపై పలు సూచనలిచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తంగా వుండాలని అధికారులకు మంత్రి సూచించారు.
నెల్లూరు జిల్లా పరిస్థితులపై ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు ఉండడంతో అమరావతిలో వున్న మంత్రి అనిల్ ఎప్పటికప్పుడు పరిస్థితిని తనకు తెలియజేస్తుండాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే పలుమార్లు ఫోన్ లో జిల్లా అధికారులతో మాట్లాడిన మంత్రి తగిన సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, తుఫాను షెల్టర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని అధికారులకు మంత్రి అనిల్ సూచించారు.
read more Tirupati Rains: వాయుగుండం ఎఫెక్ట్... భారీ వర్షాలతో తిరుమల దేవాలయం జలదిగ్భందం
ఇదిలావుంటే రాయలసీమలో వర్షతీవ్రత ఎక్కువగా వుండనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అనంతపురం జిల్లా ప్రజలు అత్యవసరమయితే తప్ప బయటికి రావొద్దని ఎస్పీ ఫక్కీరప్ప హెచ్చరించారు. ఈరోజు, రేపు (శుక్ర, శనివారాలు) తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో ఎడితెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశముందని... ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు.
ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు, ఫైర్ సిబ్బంది, మున్సిపల్ విభాగాల అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో సహాయం కోసం డయల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 08554275333 నెంబర్లకు సమాచారం అందించాలని ఎస్పీ ఫకీరప్ప సూచించారు.
నెల్లూరు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కాబట్టి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. సహాయం కోసం ప్రజలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08592-281400 కు డయల్ చేయవచ్చని లేదంటే 24 గంటలు ప్రజలకు అందుబాటులో వుండే టోల్ ఫ్రీ నెంబర్ 1077 కు డయల్ చేయవచ్చని తెలిపారు.
జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాలలోనూ కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన కలెక్టర్ తెలిపారు. ప్రజలు కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నెంబర్: 08598-223235, ఒంగోలు ఆర్ డి ఓ కార్యాలయంలో నెంబర్: 8886616044, మార్కాపురం ఆర్ డి ఓ కార్యాలయంలో నెంబర్: 9110393042 ఫోన్ చేయవచ్చని కలెక్టర్ ప్రవీణ్ తెలిపారు.