హర్ష కుమార్, ఆకుల సహా పలువురు జనసేనలోకి జంప్
తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ మంచి జోష్ మీదుంది. ఎన్నికల సమరం దగ్గర పడుతుండటంతో వలసలు ఆ పార్టీలో హుషారు నింపుతోంది. ఉభయగోదావరి జిల్లాలను
ప్రభావితం చెయ్యగల నాయకుడు పవన్ కళ్యాణ్ కావడంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఇతర పార్టీ నేతలు జనసేనలోకి క్యూ కడుతుండగా
మరికొంతమంది అవకాశం కోసం చూస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే పలువురు నేతలు జనసేనలోకి చేరబోతున్నట్లు ప్రకటించారు. మరికొంతమంది గోపీల్లా
ఉన్నారు.
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ మంచి జోష్ మీదుంది. ఎన్నికల సమరం దగ్గర పడుతుండటంతో వలసలు ఆ పార్టీలో హుషారు నింపుతోంది. ఉభయగోదావరి జిల్లాలను ప్రభావితం చెయ్యగల నాయకుడు పవన్ కళ్యాణ్ కావడంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఇతర పార్టీ నేతలు జనసేనలోకి క్యూ కడుతుండగా మరికొంతమంది అవకాశం కోసం చూస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే పలువురు నేతలు జనసేనలోకి చేరబోతున్నట్లు ప్రకటించారు. మరికొంతమంది గోపీల్లా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పంతం నానాజీ, వైసీపీ నేత కందుల లక్ష్మీదుర్గేష్, ముమ్ముడివరం వైసీపీ నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణలు వైసీపీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే తుని నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సైతం జనసేన పార్టీలోకి చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే తరహాలో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, రాజమండ్రి బీజేపీ సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పయనిస్తున్నారు.
అమలాపురంలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేశారు. పదేళ్లపాటు అన్ని సామాజిక వర్గాల నేతలతో తత్సమ సంబంధాలను కలిగి ఉన్నారు. అమలాపురం నియోజకవర్గంలో హర్షకుమార్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటం అతనికి కలిసొచ్చే అంశం. అలాగే అమలాపురంలో కాపు నేతలతో ఆయనకు ఉన్న స్నేహం అదనపు అవకాశంగా చెప్పుకోవచ్చు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంపీగా పని చేసిన ఆయన నిత్యం వివాదాల్లో నిలిచేవారు. వైఎస్ జగన్ ను సీఎం చెయ్యాలని తొలుత ప్రతిపాదించింది ఆయనే. జగన్ దివంగత సీఎం వైఎస్ఆర్ ఆస్థికి మాత్రమే వారసుడని పదవులకు కాదంటూ సంచనల కామెంట్లు చేశారు..ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏపీఎన్జీవో నేతలపై ఆయన కుమారులు చేసిన దౌర్జన్యంతో మళ్లీ వార్తల్లోకెక్కారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకారం తెలపడంతో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర మూడు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. హర్షకుమార్ ఏనిర్ణయం తీసుకున్నా కిరణ్ కుమార్ రెడ్డి నో చెప్పేవారు కాదంటే మనం ఊహించుకోవచ్చు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిందంటూ హర్షకుమార్ కాంగ్రెస్ పార్టీ దూరమయ్యారు. ఆతర్వాత కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత రాజమహేంద్రవరంలో భారీ బహిరంగ సభ పెట్టి విజయవంతం చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీ తరపున అమలాపురం ఎంపీగా పోటీ చేసి స్తబ్ధుగా ఉండిపోయారు.
2014 ఎన్నికల అనంతరం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఉంటూనే అధికార ప్రతిపక్ష పార్టీలను తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అయితే ఒకానొక దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది..కానీ చేరలేదు....అయితే 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్న హర్షకుమార్ జనసేన వైపుకు మెుగ్గు చూపారని తెలుస్తోంది.
అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వు కాబడ్డాయి. ఇకపోతే కొత్తపేట, రామచంద్రాపుం, ముమ్మడివరం,మండపేట అసెంబ్లీ నియోజకవర్గాలు జనరల్ మరియు బీసీ వర్గాలకు రిజర్వు కాబడ్డాయి. అయితే దళిత ఓటర్లు ఎక్కువగా ఉండటంతోపాటు గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు ఏర్పడ్డ పరిచయాలు కాపు నేతలతో సత్సమసంబంధాల నేపథ్యంలో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగితే గెలుపు ఖాయమని హర్షకుమార్ యోచిస్తున్నారు.
క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న హర్షకుమార్ తన రాజకీయ వారసులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసినా తన ఇద్దరు కుమారులను రాజకీయాల్లోకి తీసుకురాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ జై సమైక్యాంధ్ర పార్టీ తరపున రాజకీయ ఆరంగేట్రం చేసినా అది అట్టర్ ప్లాప్ కావడంతో ఈ సారి వాళ్ల రాజకీయ భవిష్యత్ చక్కదిద్దేలా అడుగులు వెయ్యాలని భావిస్తున్నారట. అందుకే ఉభయగోదావరి జిల్లాలను ప్రభావితం చెయ్యగల జనసేన పార్టీయే అందుకు వేదిక చేసుకోవాలని భావిస్తున్నారట.
మరోవైపు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సైతం జనసేనవైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. 2014లో టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆకుల సత్యనారాయణ రాజకీయాల్లోకి రాకముందు ఒకవైపు వైద్యుడిగా...మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థిరపడ్డారు.
రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం,అనపర్తితో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో కాపుసామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండటం...పవన్ కళ్యాణ్ అభిమానం కలిసి తన గెలుపు ఖాయమని ఆకుల సత్యనారాయణ భావిస్తున్నారట.
ఆర్థిక బలం, సామాజిక వర్గం అండదండలతో ఆకుల రాజమండ్రి ఎంపీగా పోటీ చెయ్యాలని భావిస్తున్నారట. బీజేపీ తరపున అయితే ఓటమి తప్పదని భావించిన ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలోకి చేరి ఎంపీగా పోటీ చెయ్యాలని ఆశిస్తున్నారట. తొందరలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు వీరితోపాటు మరికొందరునేతలు క్యూ కడుతున్నారు.