చంద్రబాబుపై నిందలేసిన బిజెపి నేత జీవీఎల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు తీవ్ర ఆరోపణ చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు తీవ్ర ఆరోపణ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద నిర్మించే ఇళ్లలో రాష్ట్రప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,400 చొప్పున బిల్లులు వేయడాన్ని ఆయన తప్పు పట్టారు. దేశ రాజధాని ఢిల్లీ, రాష్ట్ర రాజధాని విజయవాడలో కూడా అంత ఖర్చు కాదని అన్నారు. కేవలం పచ్చ చొక్కాల వారికే ఇళ్లు కేటాయిస్తున్నారని, పేదలు అడిగితే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు.
ఏపీకి 7లక్షలకు పైగా గృహాలు కేటాయిస్తే ఇప్పటి వరకూ 43వేలు మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు. నంబర్వన్ పరిపాలన, 40ఏళ్ల అనుభవం ఉన్న వారి పరిపాలన అంటే ఇలాగే ఉంటుందా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. 2022కల్లా దేశంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో నరేంద్రమోడీ ఈ పథకానికి రూపకల్పన చేశారని, ఆ ఆశయానికి తూట్లు పొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా కేంద్రం వద్ద బిల్లు పెండింగ్లో లేదని అన్నారు. కడపలో ఉక్కు కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వమే అడ్డు పడుతోందని ఆయన అన్నారు.