తప్పంతా చంద్రబాబుదే: ధ్వజమెత్తిన జీవీఎల్
కేంద్ర సహాయం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు తప్పు పట్టారు.
విజయవాడ: కేంద్ర సహాయం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు తప్పు పట్టారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులపై వాస్తవాలు చెప్పడం లేదని అన్నారు.
డొలేరా నగరానికి రూ. 98వేల కోట్లు ఎప్పుడు కేటాయించామో చెప్పాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. 2009లోనే ఢొలేరా నగరానికి అంకురార్పణ జరిగిందని, నాటి ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని చెప్పారు.
ప్రధానిగా మోడీ వచ్చిన తర్వాత అక్కడే నిధులు కుమ్మరిస్తున్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు డొలేరాకు రూ.1290 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కృష్ణపట్నం పూర్తి చేయడానికి చంద్రబాబు చొరవ చూపడం లేదని అన్నారు. వైజాగ్-చెన్నై కారిడార్ అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉందని జీవీఎల్ స్పష్టం చేశారు