దళిత యువతి రమ్య హత్యతో కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాారా లోకేష్ రాజకీయాలు చేయాలని చూశారని వైసిపి ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆరోపించారు.
తాడేపల్లి: గుంటూరులో ఉన్నత చదువులు చదువుతున్న దళిత బిడ్డ రమ్య హత్యను టిడిపి నాయకులు నారా లోకేష్ రాజకీయం చేయాలని చూస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆరోపించారు. రమ్య హత్య గురించి తెలియగానే సీఎం జగన్ వెంటనే స్పందించారని.... ఆ కుటుంబానికి అండగా నిలిచి నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని ఆదేశించారని తెలిపారు. బాధిత కుటుంబానికి బాసటగా నిలుస్తూ ప్రభుత్వం వెంటనే రూ.10 లక్షల ఆర్థిక సహాయం కూడా అందజేసిందన్నారు. ఆస్పత్రిలో శవ పంచనామా కూడా దగ్గరుండి చేయించి మృతదేహాన్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే...దాన్ని తరలించకుండా టీడీపీ శ్రేణులు హంగామా సృష్టించి అడ్డుకున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.
''కేవలం నారా లోకేష్ కోసమే రమ్య మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరలించకుండా టిడిపి నాయకులు ఆపారు. అక్కడ కూడా రాజకీయం చేస్తూ పార్టీ జెండాలు కట్టారు. ఆ తర్వాత ఎలాగోలా రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలిస్తే అక్కడా లోకేష్ రాజకీయం చేశాడు. ఆమె ఇంటి గేటు వద్ద 45 నిమిషాలు నిలబడిపోయారు. దీంతో ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లడం కష్టంగా మారింది'' అని తెలిపారు.
''రమ్య తల్లి తమకు న్యాయం చేయమని అడిగితే ఆ ఫోటోతో కూడా విపక్షం రాజకీయం చేసింది. నిజానికి రమ్య హత్య తర్వాత కొన్ని గంటల్లోనే నిందితుణ్ని అరెస్టు చేయడం జరిగింది. తమ బిడ్డను అన్యాయంగా చంపారని, తమకు న్యాయం చేయాలని రమ్య తల్లి కోరింది. మరోవైపు టీడీపీ తరపున వచ్చిన అడ్వకేట్ శ్రావణ్కుమార్ దిశ చట్టం గురించి మాట్లాడితే, దానికి నేను సమాధానం చెబితే దాన్ని కూడా ఓ ఛానల్ వక్రీకరించింది. ఆ స్థాయికి ఛానల్ దిగజారింది. ఇదేనా జర్నలిజమ్ అంటే?'' అని మండిపడ్డారు.
read more పెళ్ళికీ, చావుకీ ఒకే మంత్రమా... లోకేష్ వెయిటే కాదు అదికూడా కోల్పోయాడు: మంత్రి అవంతి ఎద్దేవా
''లోకేష్ వైసిపి నాయకులపై అసభ్య పదజాలంతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు అని కామెంట్ చేశాడు. మాకు విచక్షణ ఉంది కాబట్టే మేము నిన్ను ఏమీ చేయకుండా వదిలేశాం. నీకు అసలు బుర్ర ఉందా. నీవు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేమూ ఊరుకోబోం. ఎంత ధైర్యం నీకు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు అంటావా? మేము నీ కొడుకులమా. ఒరేయ్ లోకేష్... నీకు బుర్ర ఉంటే, నీ బాబు నీకు తెలివి నేర్పితే వాస్తవాలు గుర్తించు'' అని ఎమ్మెల్యే హెచ్చరించారు.
''అసలు మీరు రమ్య ఇంటి దగ్గర ఎందుకు అసలు ధర్నా చేశారు. మా ఎస్సీ అమ్మాయి చనిపోతే అక్కడ పేలాలు ఏరుకోవాలని చూస్తారా. కనీసం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చేయలేదు. మా కుటుంబ(దళిత) సభ్యురాలైన యువతి చనిపోతే, అక్కడికి వచ్చి కూడా శవ రాజకీయం చేశావు. లోకేష్ నీవు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడావు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డను ఆయన తన కుటుంబ సభ్యులుగానే చూస్తారు. అందుకే వారి రక్షణ కోసం దిశ వంటి చట్టం తీసుకువచ్చి పలు చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా ప్రజల కోసం, ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం సీఎం శ్రీ వైయస్ జగన్ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు'' అని పేర్కొన్నారు.
''లోకేష్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోము. ఖబర్దార్'' అంటూ లోకేష్ ను వైసిపి ఎమ్మెల్యే నాగార్జున హెచ్చరించారు.
