Asianet News TeluguAsianet News Telugu

పెళ్ళికీ, చావుకీ ఒకే మంత్రమా... లోకేష్ వెయిటే కాదు అదికూడా కోల్పోయాడు: మంత్రి అవంతి ఎద్దేవా

గుంటూరులో అతి కిరాతకంగా హత్యకు గురయిన విద్యార్థిని రమ్య ఇంటివద్ద నిన్నటి గందరగోళానికి టిడిపి నాయకుడు నారా లోకేష్ కారణమని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. 

minister avanti srinivas serious on nara lokesh
Author
Visakhapatnam, First Published Aug 17, 2021, 2:48 PM IST

విశాఖపట్నం: గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశామన్నారు. రాష్ట్ర హోం మంత్రి సుచరిత సోమవారమే బాధిత కుటుంబాన్ని పరామర్శించారని... వారికి ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని అందించి ఇకపైనా అన్నివిధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారన్నారు.  

ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థినిని ఈ విధంగా దారుణంగా హత్య చేయడం చాలా బాధాకరమన్నారు మంత్రి అవంతి. సోషల్ మీడియా ద్వారానే కాదు ఏ రకంగా అయినా బెదిరింపులకు పాల్పడితే మహిళలు, యువతులు భరించరాదని... వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దిశ యాప్ ను ప్రతి ఒక్క మహిళ, యువతి తమ మొబైల్స్ లో డౌన్ లోడ్ చేసుకోవాలని... ఈ యాప్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ చేయవచ్చని మంత్రి సూచించారు.  

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఈ ప్రభుత్వం ఏ కులమైనా, మతమైనా ఉపేక్షించదన్నారు. పక్క రాష్ట్రంలో ఓ మెడికోపై అఘాయిత్యం జరిగితే ముఖ్యమంత్రి జగన్ స్పందించి అసెంబ్లీలో దిశ బిల్లు చేసి చట్టం కోసం కేంద్రానికి పంపించారని గుర్తుచేశారు. అది చట్టమైతే ఇటువంటి ప్రేమోన్మాదులకు, అల్లరిమూకలకు మరింత వేగంగా శిక్షలు పడతాయన్నారు. రమ్య హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్టు చేశారని తెలిపారు మంత్రి. 

''పనిలేని ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు కుమారుడుగా తప్పితే ఏ అర్హతా లేని లోకేష్ కూడా ఈ మధ్య వెయిట్ తో పాటు విచక్షణ కూడా కోల్పోయి ముఖ్యమంత్రిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. రమ్యను కోల్పోయి వారి కుటుంబం బాధలో ఉంటే ఓదార్చాల్సింది పోయి, గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్ళకుండా అడ్డుకోవడం, పోలీసులపై  టీడీపీ నేతలు దౌర్జన్యం చేయడం బాధాకరం. ముఖ్యమంత్రి జగన్ ని వ్యక్తిగతంగా దూషించినంత మాత్రాన జీరోగా ఉన్న లోకేష్ ఎప్పటికీ హీరో కాలేడు అన్నది గుర్తుంచుకోవాలి'' అని అన్నారు.

read more  మీకు ఇద్దరు కూతుళ్లున్నారు... వారికే ఇలా జరిగుంటే ఇలాగే స్పందిస్తారా?: జగన్ ను నిలదీసిన లోకేష్

''ప్రజల మన్ననలు, సంపూర్ణ విశ్వాసంతో ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత రెండేళ్ళలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అప్రతిహాతంగా విజయ దుంధుభి మోగించారు. నాయకుడు అంటే జగన్ లా ఆదర్శంగా ఉండాలి తప్పితే చిల్లర రాజకీయాలు చేయకూడదు. లోకేష్ గ్రామస్థాయి నాయకుడి కంటే హీనంగా మాట్లాడుతున్నాడు. అమెరికాలో చదివిన లోకేష్.. ఇటువంటి భాషను మాట్లాడటం ఎంతవరకు సబబో తనకు తానే ఆత్మ విమర్శ చేసుకోవాలి. ముఖ్యమంత్రిని ప్రస్తావిస్తూ వ్యక్తిగతంగా దూషణలు చేయడం లోకేష్ మానుకోవాలి. లోకేష్ రాజకీయాల్లోకి  వచ్చిన తర్వాతే ఇటువంటి బూతుల కొత్త ట్రెండ్ తెచ్చాడు'' అని ఎద్దేవా చేశారు. 

''ఏదో యుద్ధంలో జయించిన హీరో మాదిరిగా నుదుటున పెద్ద బొట్టుపెట్టుకుని నిన్న రమ్య కుటుంబ సభ్యుల పరామర్శకు వెళ్ళాడు లోకేష్. కారు దగ్గర పిడికిలి బిగించి సంకేతాలు ఇస్తూ, పోలీసులపై దౌర్జన్యం చేస్తూ, నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంటి...? పెళ్ళికి, చావుకీ ఒకే మంత్రం అన్నట్టుగా లోకేష్ చేష్టలు ఉన్నాయి'' అన్నారు.

''ప్రతిదాన్నీ టీడీపీ  రాజకీయం చేయాలని చూడటం తగదు. దళితుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకి గానీ, లోకేష్ కు గానీ లేదు. ఎవరైనా దళితులుగా పుడతారా.. అని మాట్లాడిన చంద్రబాబు దళితుల గురించి మాట్లాడటమా.. అని ప్రజలు నవ్వుకుంటున్నారు'' అని పేర్కొన్నారు. 

''దళితులు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆత్మ లాంటి వారు. ఇకనైనా టీడీపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ను మానుకుంటే మంచిది. ప్రతిదానికీ కులాన్ని ముడిపెట్టి, కుల రాజకీయాలు చేయటం మానాలి. రమ్య హత్య ఘటనలో...  ప్రభుత్వంగానీ, పోలీసుల నిర్లక్ష్యంగానీ ఉంటే.. దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటన. రమ్య దారుణ హత్యను.. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన బాధ్యత సమాజంలో అందరిపైనా ఉంది'' అని మంత్రి అవంతి అన్నారు. 

  

Follow Us:
Download App:
  • android
  • ios