కోవిడ్ చట్టాలను ఉపయోగించుకొని ప్రజాగ్రహాన్ని అణచిపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు.  

రాజమండ్రి: ప్రజాస్వామ్యంలో ప్రజలహక్కులను హరించేలా, వారి గొంతులు నొక్కేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు. తనపై, తన అరాచక పాలనపై ప్రజల్లో ఆగ్రహం పెచ్చరిల్లకుండా ప్రకృతి విపత్తుల చట్టాలను ముఖ్యమంత్రి అడ్డుపెట్టుకుంటున్నాడని గోరంట్ల ఆరోపించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

''కోవిడ్ చట్టాలను ఉపయోగించుకొని, ప్రజాగ్రహాన్ని అణచిపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రజల ఆగ్రహం బయటపడకుండా ప్రకృతివిపత్తులు చట్టాన్ని వాడుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కఠినంగా 144సెక్షన్ అమలు చేయాలని చెప్పడమేంటి? మాస్కులు పెట్టుకోని వారికి కఠినంగా జరిమానా వేయాలంటున్న ముఖ్యమంత్రికి ప్రజాకోర్టులో రూ.1000 జరిమానా వేయాలి. ఏనాడైనా ఆయన మాస్క్ పెట్టుకున్నాడా? మాస్క్ లేకపోతే రూ.100జరిమానా వేయాలనిచెప్పారు. ఇంతకాలం నుంచి మాస్క్ పెట్టుకోనందుకు ఆయన ఎన్నివందల జరిమానా కట్టాడు? ప్రజాకోర్టు నుంచి ఆయనకు రూ.1000 జరిమానా వేస్తున్నాం. తక్షణమే ఆయన ఆ మొత్తం చెల్లించాలి'' డిమాండ్ చేశారు. 

వీడియో

''దాన్యం బకాయిల కోసం రైతులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, తమకు న్యాయం చేయాలని ఇతరత్రా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనలు చేస్తుంటే వారిపై కేసులపెడతారా? ఆ విధంగా ప్రజాగ్రహాన్ని ఈ ముఖ్యమంత్రి ఎంతకాలం నిలువరిస్తాడు? కోవిడ్ వ్యాప్తి పేరుతో ప్రకృతి విపత్తుల చట్టాన్ని అడ్డుపెట్టుకొని గత 14నెలలుగా ప్రభుత్వం ప్రజాగ్రహం నుంచి తప్పించుకుంటోంది'' అని ఆరోపించారు. 

read more రైతులేమైనా దేశద్రోహులా... సంకెళ్లతో బందించి అవమానిస్తారా?: జగన్ పై అచ్చెన్న సీరియస్

''అప్పులతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. సీఎఫ్ఎంఎస్ విధానంతో తమవారికే ప్రజలసొమ్ముని అప్పనంగా దోచిపెడుతున్నారు. అదేమని ఎవరూ ప్రశ్నించకూడదంట. 144సెక్షన్ తో, పోలీస్ పహరాలతో ప్రజాగ్రహాన్ని ఈ ముఖ్యమంత్రి ఎంతకాలం ఆపుతాడు?'' అని నిలదీశారు. 

''భారీ బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ నిబంధనలు అతిక్రమిస్తున్న ముఖ్యమంత్రికి ఏం శిక్షలు వేయాలి? నిన్న కడపలో ముఖ్యమంత్రి నిర్వహించిన సభ సంగతేమిటి? ఎక్కడైనా ఆయన ప్రజలకు చెప్పిన నిబంధనలు పాటించాడా? నిబంధనలు మీరినందుకు ఆయనకు ఎంత జరిమానా వేయాలి? ముఖ్యమంత్రితో పాటు, చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, అత్యుత్సాహం చూపుతున్న కొందరు మంత్రులు, ఐఏఎస్ అధికారులు జైలుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు'' అని బుచ్చయ్యచౌదరి హెచ్చరించారు.