విషమంగా బీటెక్ రవి ఆరోగ్యం.. గంటా
8వ రోజుకు చేరిన నిరాహార దీక్ష
కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేపట్టిన నిరాహారదీక్ష బుధవారం నాటికి 8వ రోజుకు చేరింది. బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
రమేష్, బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. రమేష్, రవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు, కలెక్టర్, ఎస్పీతో అత్యవసర సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం ఉందన్నారు.
సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. చంద్రబాబు సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని గంటా అన్నారు. కాగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం గత 7 రోజులుగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.