గన్నవరంలో ఘర్షణ.. టీడీపీ నేత పట్టాభి సహా 15 మందికి 14 రోజుల రిమాండ్
టీడీపీ నేత పట్టాభి సహా 15 మంది నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది గన్నవరం కోర్ట్. నిన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే.
కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్తతలకు సంబంధించి టీడీపీ నేత పట్టాభి సహా 15 మంది నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్ట్. గన్నవరంలో సోమవారం జరిగిన ఘర్షణ ఘటనలకు సంబంధించి వీరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం వీరిని కోర్టులో ప్రవేశపెట్టారు. నిన్న గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీజీపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు పట్టాభి ప్రయత్నించడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పట్టాభితో సహా మరొక 15 మంది టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు గన్నవరం పోలీసులు . అనంతరం వైద్యులను పోలీస్ స్టేషన్కు పిలిపించి గన్నవరం కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు.
అంతకుము టీడీపీ నేత పట్టాభి ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టాభి దగ్గరకు ఆయన భార్యను కూడా వెళ్లనివ్వడం లేదంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. బిల్డింగ్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు. పట్టాభి వద్దకు వెళ్లినివ్వని పక్షంలో భవనంపై నుంచి దూకేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతకుముందు పట్టాభి భార్య చందన మీడియాతో మాట్లాడుతూ.. తన భర్తను కొట్టారని ఆరోపించారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో ఆయనను కొట్టారని చందన అన్నారు. ముగ్గురు వ్యక్తులు ముసుగులు వేసుకొచ్చి కొట్టారని.. తన భర్తకు ప్రాణహాని వుందని ఆమె ఆరోపించారు.
ALso REad: పట్టాభిని కలవనిస్తారా .. లేదా, బిల్డింగ్ ఎక్కిన టీడీపీ కార్యకర్తలు : గన్నవరంలో హైటెన్షన్
అయితే గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి ఘటన తర్వాత తన భర్త కొమ్మారెడ్డి పట్టాభిరాం కనిపించడం లేదంటూ ఆయన భార్య చందన ఆందోళనకు దిగారు. నిన్న(సోమవారం) సాయంత్రం అరెస్ట్ చేసిన తన భర్తను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదు... ఆయనకు ఏదయినా హాని తలపెడితే సీఎం జగన్, డిజిపి బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. భర్త ఆచూకీ తెలపాలంటూ చందన డిజిపి ఇంటిముందు ధర్నాకు సిద్దమవగా పోలీసులు అడ్డుకున్నారు... దీంతో తన ఇంటిముందే కుటుంబసభ్యులతో కలసి దీక్ష చేపట్టారు. భర్త ఆఛూకీ కోసం ఆందోళన చేపడుతున్న చందనకు ఫోన్ చేసి పరామర్శించిన వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ధైర్యం చెప్పారు. ఏపీ నూతన గవర్నర్ నజీర్ ను కలిసి పరిస్థితిని వివరిస్తానని... అధైర్యపడొద్దని చందనకు భరోసా ఇచ్చారు రఘురామ.